Breaking News

ఫోన్ నేలకేసికొట్టి.. చెంప చెల్లుమనిపించి.. సామాన్యుడిపై కలెక్టర్ ప్రతాపం!


కరోనా కట్టడి కోసం దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలు విధించాయి. తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తున్నారు. వెసులుబాటు సమయం ముగిసిన తర్వాత పాస్ లేకుండా రోడ్డు ఎక్కితే వెహికిల్ సీజ్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ హాస్పిటళ్లు, మెడికల్ షాపులకు వెళ్లే వారికి మాత్రం మినహాయింపు ఇస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసులు తమ లాఠీలకు పని చెబుతూ.. లాక్‌డౌన్ ఆంక్షలు అమలవుతున్న టైంలో బయటకు వచ్చిన వారిపై ప్రతాపం చూపిస్తున్నారు. కాగా ఛత్తీస్‌గఢ్‌లో ఏకంగా జిల్లా కలెక్టరే ఓ యువకుణ్ని కొట్టడం వివాదాస్పదమైంది. శనివారం రోజున లాక్‌డౌన్ ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో సూరజ్‌పూర్‌లో ఓ యువకుడు మందులు కొనుగోలు చేయడం కోసం బయటకొచ్చాడు. అతడితో మాట్లాడిన జిల్లా .. ఆ యువకుడి ఫోన్ తీసుకొని చూసి.. కాసేపట్లోనే ఫోన్‌ను నేలకేసి కొట్టాడు. ఆ యువకుడు ఏవో పేపర్లు చూపిస్తుండగానే.. అతడి చెంప చెల్లుమనిపించాడు. అంతటితో ఆగకుండా.. పక్కనే ఉన్న పోలీసులకు వీడి సంగతేంటో చూడండని ఆదేశించాడు. దీంతో రెచ్చిపోయిన పోలీసులు తమ లాఠీలకు పని చెప్పారు. ఆ తర్వాత ఆ యువకుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కలెక్టర్ ఆదేశించాడు. ఈ తతంగం మొత్తాన్ని సెల్‌ఫోన్ కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. కేంద్ర హోం శాఖ స్పందించింది. ఇంటర్‌ స్టేట్ కౌన్సిల్ సెక్రటేరియట్ సెక్రటరీ సంజీవ్ గుప్తా ఈ విషయమై మాట్లాడుతూ.. ఆ కలెక్టర్ చర్య హేయమైందన్నారు. ఓ ఐఏఎస్ అధికారి ఇలా వ్యవహరించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఛత్తీస్‌గఢ్ చీఫ్ సెక్రటరీ దృష్టికి ఈ వ్యహారాన్ని తీసుకెళ్లారు. కలెక్టర్ మరింత హుందాగా ప్రవర్తించాల్సి ఉందన్న సంజీవ్ గుప్తా.. ఇది గోరా సాహిబ్ సిండ్రోమ్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారం పెద్దది అవుతుందని గమనించిన జిల్లా కలెక్టర్ ఆ యువకుడికి క్షమాపణలు చెప్పారు. జిల్లాలో కరోనా సమస్య తీవ్రంగా ఉందని.. ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన తెలిపారు. తనకు, తన తల్లిదండ్రులకు కూడా కోవిడ్ సోకిందన్న రణబీర్ శర్మ.. తాను కరోనా నుంచి కోలుకున్నానని.. కానీ తన తల్లికి ఇంకా తగ్గలేదని ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఆ వీడియోలో ఉన్న యువకుడు మైనర్ కాదని ఆయన వివరణ ఇచ్చారు. జిల్లా ప్రజలందరూ లాక్‌డౌన్ నిబంధనలను పాటించాలని.. ఎంతో అవసరమైతే తప్పితే ఇంట్లో నుంచి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. కాగా, ఈ ఘటనపై చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ తీవ్రంగా స్పందించారు. సూరజ్‌పూర్ కలెక్టర్‌ రణబీర్ శర్మను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌‌లో వెల్లడించారు. ‘ రణబీర్ శర్మ ఒక యువకుడిపై అసభ్యంగా ప్రవర్తించిన విషయం సోషల్ మీడియా ద్వారా నా దృష్టికి వచ్చింది. ఇది చాలా విచారకరం.. ఖండించదగింది. ఛత్తీస్‌గఢ్‌లో ఇలాంటి చర్యను అస్సలు సహించం.. కలెక్టర్ రణబీర్ శర్మను తొలగించే ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయి’ అని అన్నారు. అన్నట్టూ మరో విషయం ఏంటంటే ఓ రెవెన్యూ అధికారి దగ్గర్నుంచి పది వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా.. 2015లో ఈ ఐఏఎస్ అధికారిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దీంతో ఆయన్ను బదిలీ చేశారు.


By May 23, 2021 at 12:04PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/chhattisgarh-cm-removes-surajpur-collector-who-slapped-youth-for-violating-lockdown/articleshow/82876324.cms

No comments