Breaking News

భారత్‌లో కోవిడ్ సంక్షోభంపై ఆవేదన.. భారీ విరాళం ప్రకటించిన ట్విట్టర్


కరోనా సంక్షోభంతో సతమతమవుతోన్న భారత్‌కు పలు దేశాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు సాయానికి ముందుకొస్తున్నాయి. ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వైద్య సామాగ్రి, అవసరమైన ఔషధాలను అందజేస్తున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలు విరాళాలు అందజేశాయి. తాజాగా, సోషల్ మీడియా దిగ్గజం భూరి విరాళం ప్రకటించింది. భారత్‌కు 15 మిలియన్ డాలర్లు విరాళంగా ఇస్తున్నట్టు ట్విట్టర్ సీఈఓ ప్యాట్రిక్ డోర్సే వెల్లడించారు. ఈ మేరకు ఆయన సోమవారం ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఈ సాయాన్ని కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏ అనే మూడు స్వచ్ఛంద సంస్థల ద్వారా అందజేయనున్నారు. కేర్ ద్వారా 10 మిలియన్ డాలర్లు, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్‌ఏలకు చెరో రెండున్నర మిలియన్ డాలర్లు సాయంగా అందజేస్తున్నట్టు తెలిపారు. ‘‘సేవా ఇంటర్నేషనల్ ఒక హిందూ విశ్వాస ఆధారిత, మానవతా, లాభాపేక్షలేని సేవా సంస్థ.. సేవా ఇంటర్నేషనల్ ‘హెల్ప్ ఇండియా డిఫీట్ కోవిడ్-19’ ప్రచారంలో భాగంగా బాధితుల ప్రాణాలను నిలిపే ఆక్సిజన్ పరికరాలు, కాన్సంట్రేటర్లు, వెంటిలేటర్లు, BiPAP (Bilevel Positive Airway Pressure), CPAP (Continuous Positive Airway Pressure) యంత్రాల సేకరణకు ఈ నిధులు తోడ్పడతాయి’’ అని ఆ సంస్థ ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రులు, కోవిడ్ కేర్ కేంద్రాలు, ఇతర ఆస్పత్రులకు వీటిని అందజేయనున్నట్టు పేర్కొంది. తమ సంస్థ ద్వారా భారత్‌కు సాయం చేస్తామని ట్విట్టర్ సీఈఓ ప్రకటించడం తమ సేవలకు లభించిన గౌరవమని సేవా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్, ఫండ్ డెవలప్‌మెంట్) సందీప్ ఖండ్కేకర్ వ్యాఖ్యానించారు. ట్విట్టర్ సీఈఓకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘‘తమది ఎటువంటి లాభాపేక్షలేని స్వచ్ఛందం సంస్థ.. పవిత్రమైన హిందూ ధర్మాన్ని అనుసరించి అందరికీ సేవ చేయాలని మేము నమ్ముతున్నాం.. సర్వే భవంతు సుఖీనహ్.. అందరూ సంతోషంగా ఉండాలి’’ అని అన్నారు. ప్రపంచ పేదరికంపై పోరాడుతున్న మానవతా సంస్థలో కేర్ ఒకటి. కోవిడ్ మహమ్మారి రెండో దశ విజృంభణతో సంక్షోభం ఎదుర్కొంటున్న భారత్‌కు తక్షణ సాయం చేయడం కోసం కేర్ సంస్థకు నిధులు మంజూరు చేస్తున్నామని ట్విట్టర్ తెలిపింది. ‘‘తాత్కాలిక COVID-19 కేర్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వ చేస్తున్న ప్రయత్నాలకు నిధులు ఉపయోగిస్తారు; ఆక్సిజన్, పీపీఈ కిట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు అవసరమయ్యే అత్యవసర వైద్య సామాగ్రి అందజేస్తాం.. వ్యాక్సినేషన్‌లో ముఖ్యంగా భారత్‌లోని మారుమూల, అట్టడుగు వర్గాలకు టీకాలు అందజేయడానికి నిధులు ఖర్చుచేస్తాం’’ అని పేర్కొంది.


By May 11, 2021 at 09:11AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/twitter-ceo-donates-15-million-for-covid-19-relief-in-india/articleshow/82540766.cms

No comments