Breaking News

టేకాఫ్ సమయంలో ఊడిపడ్డ చక్రం.. విమానం బెల్లీ ల్యాండింగ్‌‌తో ప్రయాణికులు సురక్షితం


భారత విమానయాన చరిత్రలో అరుదైన, అద్భుతమైన ఘటన చోటు చేసుకుంది. నాగ్‌పూర్ నుంచి ఓ రోగితో ఎయిర్ అంబులెన్స్ హైదరాబాద్ బయల్దేరింది. అయితే, టేకాఫ్ సమయంలోనే దాని చక్రం ఊడిపోయింది. విమానం గాల్లో ఉన్నంతవరకు పర్వాలేదు. మరి ల్యాండింగ్ ఎలా? ఈ ప్రమాదం గురించి తెలియగానే సోషల్ మీడియాలో కొంత మంది ‘ఆ విమానంలో ఉన్నవాళ్ల కోసం ప్రార్థించండి’ అంటూ పోస్టులు చేయడం మొదలుపెట్టారు. దీంతో అలజడి రేగింది.. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంతకీ ఆ రోగికి ఏమైంది? బెల్లీ ల్యాండింగ్ అంటే ఏమిటి? తదితర వివరాలు మీ కోసం.. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అనారోగ్యానికి గురైన ఓ వ్యక్తి పరిస్థితి విషమించింది. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ప్రత్యేక చికిత్స ఉందని తెలుసుకొని అతడిని ఇక్కడికి తరలించాలని నిర్ణయించారు. మే 6న రాత్రి నాగ్‌పూర్ విమానాశ్రయం నుంచి ఎయిర్ అంబులెన్స్ బయల్దేరింది. విమానంలో ఆ పేషెంట్‌తో పాటు అతడి బంధువు, ఓ డాక్టర్, ఇద్దరు క్రూ సిబ్బంది మొత్తం ఐదుగురు ఉన్నారు. అయితే.. విమానం గాల్లోకి ఎగిరే సమయంలోనే దాని చక్రాల్లో ఒకటి ఊడిపోయి కిందపడిపోయింది. ఆ విషయాన్ని గమనించిన పైలట్ ఏటీసీకి సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు వెంటనే ఎయిర్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాన్ని ముంబై ఎయిర్ పోర్టుకు మళ్లించాల్సిందిగా పైలట్‌ను ఆదేశించారు. అటు ముంబై ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటించారు. నాగ్‌పూర్ నుంచి విమానం అక్కడికి చేరుకునే సరికి ఎమర్జెన్సీ టీమ్ అంతా రెడీగా ఉంది. ఫైరింజన్ టీమ్, రెస్క్యూ టీమ్, వైద్య బృందం, CISF సిబ్బంది స్పాట్‌‌లో రెడీగా ఉన్నారు. అత్యవసర వాహనాలను అందుబాటులో ఉంచారు. అప్పటికే రన్ వే నంబర్ 27ను Foam (నురుగు)తో నింపేశారు. విమానాన్ని బెల్లీ ల్యాండింగ్ చేస్తున్నట్లు పైలట్ సమాచారం ఇచ్చాడు. అత్యవసర సమయాల్లో లేదా విమానం చక్రాలు తెరుచుకొని విపత్కర పరిస్థితుల్లో విమానం తోక భాగాన్ని నేలకు తాకిస్తూ ల్యాండింగ్ చేస్తారు. దీన్ని సాంకేతిక పరిభాషలో బెల్లీ ల్యాండింగ్ అంటారు. అయితే.. దీన్ని ఎంతో నేర్పుగా, ఒడుపుగా చేయాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, విమానం నేలతో రాపిడికి గురై మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అయితే.. కెప్టెన్ కేసరి సింగ్ ఎలాంటి ప్రమాదం లేకుండా విమానాన్ని రాత్రి 9 గంటల 9 నిమిషాలకు సురక్షితంగా బెల్లీ ల్యాండింగ్ చేశాడు. ఆ వెంటనే గ్రౌండ్ సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానానికి పైపులతో వాటరింగ్ చేశారు. అనంతరం విమానంలో ఉన్న ఐదుగురినీ సురక్షితంగా బయటకి తీసుకొచ్చారు. దీంతో అధికారులు, బాధితుల బంధువులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత ముంబై ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి. పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ.. వివరాలు వెల్లడించారు. విమాన క్రూ సిబ్బంది, గ్రౌండ్ సిబ్బందిని కొనియాడారు. ఈ ఘటన గురించి తెలుసుకొని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అనేక మంది.. పైలట్‌ను, ఎయిర్‌పోర్టు సిబ్బందిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ‘‘పైలట్ సాహసానికి సెల్యూట్.. విమానంలో ఉన్న రోగి, డాక్టర్, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలుసుకోవడం ఆనందంగా ఉంది. గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది సహామొత్తం ముంబై విమానాశ్రయ బృందాన్ని మెచ్చుకోవాలి’’ అంటూ బాలీవుడ్ నటుడు రితేశ్ దేశ్‌ముఖ్ ట్వీట్ చేశారు.


By May 07, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/flight-with-covid-patient-makes-emergency-belly-landing-at-mumbai-airport-after-malfunction/articleshow/82448119.cms

No comments