Breaking News

ప్రపంచంలోనే అత్యధిక టీకాలు వేసిన దేశంలో కరోనా ఉద్ధృతం.. ఆ టీకాయే కారణం!


ప్రపంచంలో అత్యధిక జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తిచేసిన సీషెల్స్‌లో కరోనా విజృంభిస్తోంది. చైనా వ్యాక్సిన్ సినోఫార్మ్‌ను షీషెల్స్ వినియోగించగా.. ఈ టీకా తీసుకున్నా భారీగా కోవిడ్ బారిపడుతున్నారు. మార్చిలో సైనోఫామ్ వ్యాక్సిన్ వేసుకున్న మారియా నైగీ అనే కాల్ సెంటర్ ఉద్యోగికి కోవిడ్ లక్షణాలు బయటపడ్డాయి. రుచి, వాసన కోల్పోయి క్రమంగా గొంతు నొప్పి రావడంతో కోవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్దారణ అయ్యింది. ఆమెకే కాదు ఈ టీకా తీసుకున్న చాలా మందికి ఇటువంటి పరిస్థితే ఎదురవుతోంది. తమ దౌత్య విధానానికి సినోఫార్మ్ ఎంతగానో తోడ్పడుతుందని చైనా భావించింది. ఈ టీకా చైనా పౌరులతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా రక్షణగా నిలుస్తుందని ఊహించింది. ప్రపంచ ఆరోగ్యంపై చైనా ప్రభావాన్ని అంచనా వేసే కన్సల్టెన్సీ బ్రిడ్జ్ బీజింగ్ ప్రకారం.. పలు దేశాల మెప్పు పొందడానికి చైనా 13.3 మిలియన్ సినోఫార్మ్ డోస్‌లను విరాళంగా ఇచ్చింది. అయితే, చైనా అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ టీకాపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ టీకా క్లినికల్ ట్రయల్స్‌లో పారదర్శకత లోపించడమే ఇందుకు కారణం. ప్రపంచంలోని అత్యధిక టీకాలు వేసిన సీషెల్స్‌లో పాజిటివ్ కేసుల్లో భారీ పెరుగుదల ఉంది. మహమ్మారిపై పోరాటంలో భాగంగా చైనా టీకాను వినియోగిస్తున్న 56 దేశాలకు ఇది ఎదురుదెబ్బ. సీషెల్స్ తన జనాభాలోని 60 శాతం మందికి ఈ టీకాను అందజేసింది. చైనా వ్యాక్సిన్లను ఎంచుకున్న అభివృద్ధి చెందుతున్న దేశాలు.. మోడెర్నా, ఫైజర్, ఆక్స్‌ఫర్డ్ టీకాలను వినియోగిస్తున్న దేశాల కంటే వెనుకబడిపోతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అంతరం మహమ్మారి కొనసాగడానికి అవకాశం కల్పిస్తుందని ఆందోళన చెందుతున్నారు. ‘ఆ ఆర్ధిక ప్రయోజనం పొందడానికి వాస్తవానికి అధిక-సమర్థత వ్యాక్సిన్లను ఉపయోగించాలి.. లేకపోతే దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో సహజీవనం చేయాల్సి వస్తుంది’ అని న్యూ సౌత్ యూనివర్సిటీ కిర్బి బయో సెక్యూరిటీ ప్రోగ్రామ్‌కు నాయకత్వం వహించిన రైనా మాక్ ఇంటైర్ అన్నారు. సీషెల్స్‌ కంటే ఎక్కడా ఇటువంటి పరిణామాలు లేవు.. జనాభాలో 60 శాతానికి పైగా టీకాలు వేయడానికి సినోఫార్మ్ వ్యాక్సిన్‌పై ఎక్కువగా ఆధారపడింది. కేవలం 100,000 జనాభా కలిగిన ఈ చిన్న దేశం ప్రస్తుతం మహమ్మారి కేసులు పెరగడంతో తీవ్ర ఆందోళన చెందుతోంది. కోవిడ్ కట్టడికి లాక్‌డౌన్‌ను తిరిగి అమల్లోకి తెచ్చింది. సీషెల్స్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. 57 శాతం మందికి సినోఫార్మ్.. 43 శాతం మందికి ఆస్ట్రాజెన్‌కా టీకా ఇచ్చారు. ప్రస్తుతం అక్కడ ఉన్న యాక్టివ్ కేసుల్లో పూర్తిగా రెండు డోస్‌లు వేసుకున్నవారు 37 శాతం ఉన్నారు.


By May 13, 2021 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/worlds-most-vaccinated-nation-seychelles-is-spooked-by-covid-cases/articleshow/82594414.cms

No comments