Breaking News

నేడు ప్రధాని సమీక్ష.. దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సిఫార్సు?


భారత్‌పై కరోనా మహమ్మారి తీవ్ర ప్రభావం చూపుతోంది. శనివారం ఒక్క రోజే దేశంలో దాదాపు 4 లక్షలకు చేరువలో కేసులు నమోదు కాగా.. 3689 మంది కోవిడ్‌కు బలయ్యారు. ఊహకు అందని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కేసుల సంఖ్య ఈ స్థాయిలో పెరుగుతుండటంతో.. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. దీంతో కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్ ఒక్కటే పరిష్కారమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌లోని పలువురు సభ్యులు సైతం కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడమే ఉత్తమమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎయిమ్స్, ఐసీఎంఆర్ లాంటి ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్థలకు చెందిన సభ్యులతో ఈ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. దేశంలో కరోనా కేసులు ఈ స్థాయిలో పెరగడానికి డబుల్ మ్యూటెంట్ వేరియంట్ కారణమనేది.. టాస్క్‌ఫోర్స్‌లోని కొందరు సభ్యుల మాట. ఈ డబుల్ మ్యూటెంట్ వల్లే కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని.. కేసుల సంఖ్య ఇలాగే పెరిగితే.. హెల్త్ కేర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడం ముఖ్యమని వ్యాక్సినేషన్ నిపుణుల గ్రూప్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ డాక్టర్ వీకే పాల్.. ప్రధాని మోదీకి సూచించే అవకాశం ఉందని కథనాలు వెలువడుతున్నాయి. లాక్‌డౌన్ చివరి అస్త్రమని ప్రధాని మోదీ ఇటీవలే చెప్పారు. కోవిడ్ తొలి వేవ్ సమయంలో.. భారత్‌లో గతేడాది సెప్టెంబర్‌లో ఒక్కరోజులో అత్యధికంగా 97 వేల కేసులు నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా ఒక్క రోజులోనే 4 లక్షలకు చేరువలో ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ పేరిట ఆంక్షలు విధిస్తున్నాయి. కానీ కోవిడ్‌ను కట్టడి చేయడం కోసం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడమే సరైందని టాస్క్‌ఫోర్స్ సభ్యులు కొందరు అభిప్రాయపడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో దేశంలో కోవిడ్ పరిస్థితులపై సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కరోనా కట్టడికి తీసుకునే చర్యలపై చర్చించనున్నారు. కాగా గతేడాది మార్చిలో విధించిన లాక్‌డౌన్ కారణంగా దేశంలో కోట్లాది మంది వలస కూలీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు బస్సులు, రైళ్లు అందుబాటులో లేకపోవడంతో.. వేలాది కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించారు. లాక్‌డౌన్ కారణంగా కోట్లాది మంది ఉపాధి కోల్పోవడంతోపాటు.. దేశ ఆర్థిక ప్రగతి మైనస్‌లోకి వెళ్లింది.


By May 02, 2021 at 10:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-19-taskforce-members-push-for-national-lockdown-to-break-chain-of-transmission/articleshow/82352018.cms

No comments