Breaking News

కోవిడ్ రోగితో సహా అసెంబ్లీ వద్ద బంధువులు నిరసన.. సీఎస్ జోక్యంతో ఆస్పత్రిలో బెడ్!


దేశంలో కరోనా సృష్టిస్తోన్న విలయంతో ఆస్పత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. కోవిడ్ బాధితులకు ఆస్పత్రుల్లో పడకలు దొరకని పరిస్థితి ఎదురయ్యింది. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ ఉదంతం దేశంలో కరోనా కారణంగా ఏర్పడిన దయనీయ స్థితికి అద్దం పడుతోంది. కరోనా బారినపడ్డ ఓ బాధితురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే, బెంగళూరులోని ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా బాధితురాలికి ఎక్కడా బెడ్‌ దొరకలేదు. దీంతో నిస్సాహయ స్థితిలో ఆ కుటుంబం కొవిడ్‌ రోగిని అంబులెన్సులో తీసుకొని ముందుకు చేరుకున్నారు. లోపలికి వెళ్లేందుకు వారు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో విధాన సభ ముందే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారికి మద్దతుగా బంధువులు చేరుకోగా.. ఈ విషయం తెలుసుకున్న యువజన కాంగ్రెస్ నేత నాల్పాద్ అక్కడికి చేరుకొని నిరసనలో పాల్గొన్నారు. దాదాపు అరగంట పాటు విధానసౌధ ఎదుట ఆందోళన కొనసాగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రవికుమార్‌ వెంటనే బాధితుడికి బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రిలో బెడ్‌ ఏర్పాటు చేశారు. విధానసౌధ ఎదుట ఆందోళనకు దిగిన యువజన కాంగ్రెస్ నేతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభానికి అద్దం పడుతోంది. దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ అత్యధికంగా ఉన్న తొలి 10 రాష్ట్రాల్లో కర్ణాటక ఉంది. అంతేకాదు, గురువారం మహారాష్ట్ర తర్వాత అత్యధికంగా దాదాపు 50వేల పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. మహమ్మారికి మరో 324 మంది బలయ్యారు. కర్ణాటకలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో సగం బెంగళూరులోనే బయటపడుతున్నాయి. దీంతో ఔషధాలు, ఆక్సిజన్ కోసం తీవ్ర కొరత ఏర్పడింది. దీనిని కూడా కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. బెంగళూరులో పడకలను బ్లాక్‌ చేసి.. అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శల నేపథ్యంలో కరోనా సాంకేతిక నిపుణుల బృందం కొవిడ్‌ వార్‌ రూంలను గురువారం తనిఖీ చేశారు. కర్ణాటకలో ఆక్సిజన్‌ కొరతతో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య లెక్కకు అందకుండా పోతోంది. ఏప్రిల్‌ తొలివారం నుంచే కరోనా పరిస్థితిని గమనిస్తున్న హైకోర్టు.. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూనే ఉంది. ప్రభుత్వం చేతులెత్తేసినట్లు గుర్తించి తానే స్వయంగా జోక్యం చేసుకుంది. తమకు కనీసం కనీసం 1,417 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రోజూ సరఫరా చేయాలని కేంద్రానికి ముఖ్యమంత్రి యడియూరప్ప విన్నవించారు. కేంద్రం ప్రస్తుతం 945 మెట్రిక్‌ టన్నులకు మించి ఇవ్వడంలేదు. ఇదే సమయంలో.. చామరాజనగర, కలబురగి ఉదంతాలు వెలుగుచూడటంతో హైకోర్టు నేరుగా ఆక్సిజన్‌ కోసం కేంద్రానికి సూచనలు చేసింది.


By May 07, 2021 at 08:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-patient-goes-to-assembly-for-protest-and-finally-gets-bed-in-karnataka/articleshow/82448713.cms

No comments