Breaking News

ఇకపై ఆ రాముడే దిక్కు.. యూపీ పరిస్థితులపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు


ఉత్తర్ ప్రదేశ్‌‌లో కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై మరోసారి పెదవి విరించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, చిన్న పట్టణాల్లో వైద్య మాలిక సదుపాయాల విషయంలో ఆందోళన వ్యక్తం చేసింది. ‘‘రాముడే దిక్కు’’ (ప్రజలను దేవుడే కాపాడాలని) అని వ్యాఖ్యానించింది. రాష్ట్రంలోని కోవిడ్ పరిస్థితులపై విచారణ జరుపుతున్న అలహాబాద్ హైకోర్టు.. సోమవారం నాటి విచారణలో జస్టిస్ సిద్ధార్ధ వర్మ, జస్టిస్ అజిత్ కుమార్‌ల ధర్మాసనం ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ‘‘చిన్న నగరాలు, గ్రామాలకు సంబంధించి ‘మొత్తం వైద్య విధానం’, రాముడే దిక్కు (దేవుని దయ వద్ద) అనే లాగా ఉందని తమ పరిశీలనలో వెల్లడయ్యింది’’అని వ్యాఖ్యలు చేసింది. గత నెల కరోనా బారినపడ్డ ఓ వ్యక్తి చికిత్స కోసం మీరట్ హాస్పిటల్‌లో చేరగా.. అతడు కనిపించకుండా పోవడంపై ముగ్గురు సభ్యుల కమిటీ సమర్పించిన నివేదికను న్యాయస్థానం పరిశీలించింది. ‘‘ మీరట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ కుమార్ అనే బాధితుడు.. టాయ్‌లెట్‌లో కుప్పకూలిపోయాడు.. తర్వాత అతడిని స్ట్రెచర్‌పై వేసి సపర్యలు చేసినా అప్పటికే అతడు చనిపోయాడు.. అయితే, తర్వాత అతడిని గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాంగా ఆస్పత్రిలోని వైద్యులు, సిబ్బంది పారేశారు.. ఇది రాత్రి షిఫ్ట్‌లో ఉన్న వైద్యుల అజాగ్రత్త, నిర్లక్ష్యానికి పరాకాష్ట’’ అని న్యాయస్థానం పేర్కొంది. ‘‘ఉత్తర్ ప్రదేశ్‌లోని వైద్య మౌలిక సదుపాయాల విషయానికొస్తే ఈ కొద్ది నెలల్లో ఈ రోజు ఉన్న పరిస్థితి ఇది చాలా సున్నితమైంది.. బలహీనంగా ఉందని మేము గ్రహించాం.. సాధారణ సమయంలో మన ప్రజల వైద్య అవసరాలను తీర్చలేనప్పుడు ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో అది ఖచ్చితంగా కుప్పకూలిపోతుంది’’అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా బిజ్‌నోర్ జిల్లాలోని పరిస్థితులను ఉదాహరణగా చూపింది. ‘రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన వివరాలు ఆశ్చర్యానికి గురిచేశాయి.. బిజ్‌నోర్ జిల్లాలో లెవల్ -3 ఆసుపత్రి లేదు.. మూడు ప్రభుత్వ ఆసుపత్రులలో 150 పడకలు మాత్రమే ఉంటే.. బీఐపీఏపీ యంత్రాలు 5, హై ఫ్లో నాసిల్ క్యానల్స్ కేవలం రెండే ఉన్నాయి.. ఒక వేళ గ్రామీణ ప్రాంతాల్లో 32 లక్షల మంది ప్రజలుంటే కేవలం 10 సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి.. అంటే మూడు లక్షల మందికి ఒక సీహెచ్‌సీ.. 30 పడకలు.. దీని ప్రకారం ఒక్కో సీహెచ్‌సీలో 0.01 శాతం మందికి మాత్రమే బీఐపీఏపీ మెషిన్ (వెంటిలేటర్) లేదా నాసిల్ క్యానల్స్ ఉన్నాయి’ అని పేర్కొంది. ‘‘300 పడకలకు 250 సిలిండర్లతో 17 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. ఆక్సిజన్ సిలిండర్ల సామర్థ్యం ఏంటి, సీహెచ్సీలో ఈ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఆపరేట్ చేయడానికి శిక్షణ పొందిన వ్యక్తులు ఉన్నారా అనేది వివరంగా తెలియదు’’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. యూపీలో ఇప్పటి వరకూ 16.19 లక్షల మంది వైరస్ బారినపడ్డారు. గత నెలలో రోజువారీ కేసులు 20 వేల మార్క్ దాటాయి. కానీ, అక్కడ మెడికల్ ఆక్సిజన్ కొరత లేదని ప్రభుత్వం ప్రకటించడం పట్ల విస్మయం వ్యక్తమయ్యింది. ఆరోగ్య మౌలిక సదుపాయాల కొరత తీవ్రంగా ఉందని బాధితులే గగ్గోలు పెడుతుంటే ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీలేదని చెప్పుకోవడం గమనార్హం. గత కొద్ది రోజులుగా గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు కొట్టుకొస్తుండగా.. నదీ తీరంలో ఇసుక దిబ్బల్లో శవాలు బయటపడుతున్నాయి. యూపీ, బిహార్‌లో ఇటువంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.


By May 18, 2021 at 12:34PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-allahabad-high-court-concern-about-rural-up-healthcare-system/articleshow/82732351.cms

No comments