Breaking News

బోగీల నుంచి విడిపోయి నదిలోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రయాణికులు సేఫ్


రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పి, భోగీల నుంచి విడిపోయిన రైలు ఇంజిన్ ముందుకెళ్లి నదిలో పడిన ఘటన ఝార్ఖండ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. షిమ్డెగా-రాంచీ మార్గంలో గ‌ల కనర్వా రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో తృటిలో ప్ర‌యాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హటియా-రూర్కెలా ప్యాసింజర్ రైలు ఇంజిన్ ప‌ట్టాల త‌ప్పి బోగీల నుంచి విడిపోయి నేరుగా నదిలో పడింది. ఈ ఘటన జరిగిన సమయంలో రైలులో సుమారు 200 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. బుధవారం రాత్రి ఈ ప్యాసింజర్ రైలు రాంచీ స్టేషన్ నుంచి హటియాకు బయలుదేరింది. ఈ క్రమంలో కనర్వా స్టేషన్ సమీపంలోని దేవనది సౌత్ క్యాబిన్ వద్ద పట్టాలు తప్పింది. బోగీల నుంచి ఇంజిన్ విడిపోయి త‌రువాత అది నదిలోకి దూసుకెళ్లింది. అయితే, బోగీలు మాత్రం ప‌ట్టాల‌పైనే నిలిచిపోవ‌డంతో ప్రయాణికులంతా తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ ఘ‌ట‌న గురించి సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైలు బానో స్టేషన్ నుంచి సాయంత్రం 7:25 గంటలకు బ‌య‌లుదేరింది. రాత్రి 8:20 గంటలకు క‌నర్వా స్టేషన్ దాటి సౌత్ క్యాబిన్ దేవ‌న‌ది సమీపానికి చేరుకుంది. ప్రయాణికులందరినీ రూర్కెలా రైల్వే స్టేషన్‌కు త‌ర‌లించారు. ఒకవేళ బోగీల‌ నుంచి ఇంజిన్ విడిపోకపోయింటే పెను ప్రమాదమే జరిగేదని ప్రయాణీకులు తెలిపారు. ఈ ప్ర‌మాదం కార‌ణంగా ఎటువంటి న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని డీఆర్ఎం నీరజ్ అంబస్ట్ పేర్కొన్నారు. యాక్సిడెంట్ రిలీఫ్ రైలును హటియా నుంచి పంపి పునరుద్దరణ చర్యలు చేపట్టినట్టు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. లోకో పైలట్ లేదా స్టేషన్ మాస్టర్ తప్పిదమా అనేది దర్యాప్తులో తేలుతుందన్నారు. ప్రమాదం నుంచి లోకో పైలట్ చాకచక్యంగా తప్పించుకున్నాడు. పెను ప్రమాదం తప్పడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.


By May 20, 2021 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ranchi-hatia-passenger-train-engine-fell-in-river-shouted-in-passengers-in-jharkhand/articleshow/82790781.cms

No comments