Breaking News

‘గాయపడిన బెంగాల్ పులి.. మోదీ-షాల దుమ్ము దులిపింది’ దీదీపై బీజేపీ పాత మిత్రుడు ప్రశంసలు


పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై తన అధికార పత్రిక సామ్నాలో సోమవారం సంపాదకీయం ప్రచురించిన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించడానికి ద్వయం నాయకత్వంలోని బీజేపీ మొత్తం దృష్టిపెట్టినా దుమ్ముకొట్టుకుపోయింది అని ఎద్దేవా చేసింది. బెంగాల్‌‌లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ అఖండ విజయం సాధించారు. అయితే, అధినేత్రి మాత్రం నందిగ్రామ్‌లో ఒకప్పటి తన కుడిభుజం సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు. ‘‘బెంగాల్‌లో మమతా బెనర్జీ హ్యాట్రిక్ విజయం సాధించారు.. మోదీ-షా ద్వయం సృష్టించిన తుఫాను అడ్డుకున్నారు... బీజేపీ ఇన్సింగ్ 100లోపే కుప్పకూలిపోయింది.. మే 2 తర్వాత మమతా దీదీ ఇంటికెళతారంటూ ప్రచారం చేశారు.. అటువంటి నినాదాలను ప్రధాని చేసి.. పెద్ద ఎత్తున డబ్బు వెదజల్లి అధికారం, ప్రభుత్వ యంత్రాంగంతో మమతాను ఇంటికి పంపాలని ప్రయత్నించారు... అయినప్పటికీ, మమతా బెనర్జీ తన మొండితనంతో గెలిచింది’’ అని సంపాదకీయంలో పేర్కొంది. ‘‘బెంగాల్‌లోని అన్ని వర్గాల ప్రజలూ బీజేపీని తిరస్కరించారు.. బెంగాల్‌లో మమతాను ఓడించడానికి బీజేపీ ‘జై శ్రీరామ్’’నినాదం చేసినా.. ‘బేగమ్ మమతా’ అంటూ వెక్కిరించి హిందూ-ముస్లిం ఓట్లలో చీలికకు ఏం చేసినా విజయవంతం కాలేదు.. హిందూ ఓటర్ల ఎక్కువ ఉన్న స్థానాల్లోనూ మమతా విజయం సాధించారు’’ అని తెలిపింది. ‘‘గాంధీ శాంతి బహుమతిని బంగ్లా జాతిపితి షేక్ ముజిబూర్ రెహ్మాన్‌కు ప్రకటించి బంగ్లాదేశ్‌లో పర్యటించిన ప్రధాని మోదీ.. ఆ అవార్డును ఆయన కుమార్తె షేక్ హసీనాకు అందజేశారు.. ముస్లిం ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికే మోదీ బంగ్లాలో పర్యటించారనే ప్రచారం జరిగింది.. కానీ, అది కూడా ఫలించలేదు..మమతా బెనర్జీ పార్టీ విధ్వంసానికి గురయ్యింది.. కానీ మోడీ-షాలకు మమతా దుమ్ము దులిపింది’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. చాలా మంది అనుభవజ్ఞులను పోటీకి నిలబెట్టిన తర్వాత కూడా బీజేపీ విజయవంతం కాలేదని నొక్కిచెప్పిన సేన.. ఓటమికి నైతిక బాధ్యత ఎవరు తీసుకుంటారో నిర్ణయించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ‘‘దేశ ప్రధాని, హోంమంత్రి ఎన్నికలు తమ వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావిస్తే గెలుపోటముల ఘనతను అంగీకరించాలి ఇది రాజకీయాల్లో సంప్రదాయం’’ అని ఎద్దేవా చేసింది. ‘‘కేరళలో 80 ఏళ్లు పైబడిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించింది.. అక్కడ ఐదు సీట్లు కూడా గెలుచుకోలేదు..అంటే, మోదీ-షా ద్వయం బీజేపీకి ఎన్నికలలో విజయం సాధించే యంత్రాంగం, సామాగ్రీ ఉన్నప్పటికీ, అవి అజేయమైనవి కావు.. ప్రజలు తమ సున్నితమైన అంశాలను నమ్ముతారు. ఎన్నికల సమయంలో పశ్చిమ బెంగాల్ పులి గాయపడింది.. ఆ గాయపడిన పులి గాడ్రించి దేశ రాజకీయాలకు కొత్త దిశను చూపింది.. ఈ విషయంలో బెంగాల్ ప్రజలను మెచ్చుకోవాలి’’ అని దేశంలో రాజకీయ మార్పులు ఖాయమని పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది.


By May 03, 2021 at 11:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/mamata-made-modi-shah-bite-the-dust-despite-bjp-putting-all-its-might-shiv-sena/articleshow/82366156.cms

No comments