Breaking News

Air India ఎయిరిండియాపై భారీ సైబర్ దాడి.. 45 లక్షల మంది డేటా చోరీ


ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాపై హ్యాకర్లు సైబర్ దాడులకు పాల్పడి.. భారీ స్థాయిలో డేటా చోరీకి పాల్పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎయిరిండియా వెల్లడించింది. కానీ ప్రయాణికులు వివరాలకు సంబంధించి తగిన భద్రతా ప్రమాణాలు పాటించామని పేర్కొంది. ప్రయాణికుల సేవల వ్యవస్థ ‘ఎస్‌ఐటీఏ’పై ఫిబ్రవరిలో సైబర్‌దాడులు జరగడంతో కొంత మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్‌ అయినట్టు శుక్రవారం ఎయిరిండియా ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది. ఆగస్టు 26, 2011 నుంచి ఫిబ్రవరి 3, 2021 మధ్య పదేళ్లలో ప్రయాణికులకు సంబంధించిన పుట్టిన తేదీ, మొబైల్‌ నెంబరు, పాస్‌పోర్టు, టికెట్‌, క్రెడిట్‌ కార్డుల వివరాల సహా వ్యక్తిగత సమాచారం చోరీకి గురయినట్టు పేర్కొంది. దీని ప్రభావం 45 లక్షల మంది కస్టమర్లపై పడిందని వివరించింది. జరిగిన మూడు నెలల తర్వాత తొలిసారిగా ఎయిరిండియా వివరాలు వెల్లడించడం గమనార్హం. ‘మేము, మా డేటా ప్రాసెసర్‌ కలిసి పరిష్కార చర్యలు చేపడుతూనే ఉన్నాం. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తమ పాస్‌వర్డ్‌లు మార్చుకోవాలని కోరుతూ ఉన్నా’మని తెలిపింది. ఎయిరిండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 45 లక్షల ప్రయాణికుల సమాచారం లీక్ అయినట్లు ప్రకటనలో తెలియజేసింది. ఎయిరిండియాకు సేవలందించే స్విట్జర్లాండ్‌కు చెందిన ఎస్ఐటీఏపై ఫిబ్రవరి 2021 చివరి వారంలో సైబర్‌ దాడి జరిగినట్లు దేశీయ విమయాన సంస్థ తెలిపింది. దాడి ఏ స్థాయిలో జరిగిందనే అంశంపై ఫోరెన్సిక్‌ విశ్లేషణ జరుగుతోందని..ఆ దాడి తర్వాత తమ వ్యవస్థలో ఎటువంటి అనధికార కార్యకలాపాలు జరగలేదని ఎస్‌ఐటీఏ స్పష్టం చేసినట్లు వివరించింది. జెనీవా కేంద్రంగా పనిచేసే ఎస్ఐటీఏ.. సింగ్‌పూర్ ఎయిర్‌లైన్స్, లుఫ్తాన్సా, ఎయిరిండియా సహా పలు సంస్థలకు సేవలందిస్తోంది. సైబర్ దాడులతో కొంత మంది ప్రయాణికుల వ్యక్తిగత సమాచారం లీక్ అయినట్టు ఫిబ్రవరి 25న తొలుత డేటా ప్రాసెసర్ నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటికీ నిర్దిష్ట సమాచారం మాత్రం మార్చి 25, ఏప్రిల్ 5న మాత్రమే మాకు అందిందని ఎయిరిండియా తెలిపింది. ఎస్ఐటీఏ మాత్రం మార్చిలోనే సైబర్ దాడుల గురించి తొలిసారి ప్రకటన చేసింది. 2018లో జరిగిన సైబర్ దాడుల్లో తన వినియోగదారులలో 4 లక్షల మందికిపైగా సమాచారాన్ని రక్షించడంలో విఫలం కావడంతో 20 మిలియన్ పౌండ్లకుపైగా బ్రిటిష్ ఎయిర్‌వేస్ జరిమానా విధించింది.


By May 22, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/45-lakh-affected-in-massive-cyber-attack-air-india-data-breach-including-credit-cards/articleshow/82849241.cms

No comments