Breaking News

10వేల రెమ్‌డెసివిర్ వయల్స్ పంపిన బంగ్లా.. చరిత్రలో తొలిసారి భారత్‌కు సాయం!


భారత్‌లో కరోనా సంక్షోభానికి తమ వంతు సాయంంగా పలు దేశాలు ఔషధాలు, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, పీపీఈ కిట్లు తదితర వైద్య సామాగ్రిని అందజేస్తున్నాయి. తాజాగా, బంగ్లాదేశ్ 10వేల ఇంజెక్షన్లను భారత్‌కు పంపింది. కోవిడ్ బాధితులకు అత్యవసర చికిత్సలో రెమ్‌డెసివిర్‌ను వినియోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సరిహద్దు పోర్టు పెట్రాపోలే వద్ద భారత ప్రభుత్వ ప్రతినిధికి కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషనర్ తౌఫిక్ హసన్ గురువారం రెమ్‌డెసివిర్ అందజేశారు. దేశంలో రోజువారీ కేసులు నాలుగు లక్షలు దాటుతున్నాయి. వరుసగా రెండో రోజూ భారత్‌లో పాజిటివ్ కేసులు 4 లక్షలు దాటగా.. గత 10 రోజుల నుంచి మరణాలు 3వేలకుపైగా చోటుచేసుకుంటున్నాయి. తమ దేశంలో స్థానికంగా ఉత్పత్తి అయిన 10 వేల రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ల ప్రధాని షేక్ హసినా సూచనలతో బంగ్లాదేశ్ ప్రజల తరఫున భారత్‌‌లోకి కోవిడ్ బాధితులకు అందజేస్తున్నామని అధికారులు ప్రకటించారు. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు తొలిసారిగా అందిన వైద్య సాయం ఇదే కావడం విశేషం. కరోనాపై పోరులో భారత్‌కు తమ వంతు సాయం చేస్తామని, అత్యవసర ఔషధాలు, వైద్య సామాగ్రి పంపనున్నట్టు గతవారం బంగ్లాదేశ్ ప్రకటించింది. ఇందులో భాగంగా 10వేల వయల్స్ రెమ్‌డెసివిర్, 30,000 పీపీఈ కిట్లు, వేలాదిగా జింక్, కాల్షియం, విటమిన్ సీ సహా అత్యవస ఔషధాలు అందజేస్తామని తెలిపింది. ‘‘ఈ క్లిష్టమైన సమయంలో బంగ్లాదేశ్ తన దగ్గరి పొరుగు దేశం భారత్‌కు సంఘీభావం తెలుపుతుంది.. అక్కడవారి ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైనం సహాయాన్ని అందించడానికి, సామాగ్రి సమీకరించడానికి సిద్ధంగా ఉంది’’ అని బంగ్లా విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఏ సామయైనా చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భారత్‌కు ఇప్పటి వరకూ 40కిపైగా దేశాలు సాయానికి ముందుకొచ్చాయి. ఆక్సిజన్ సంబంధిత పరికరాలు, వైద్య సామాగ్రిని పంపుతున్నాయి.


By May 07, 2021 at 12:29PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/corona-crisis-bangladesh-sends-10000-vials-of-remdesivir-to-india/articleshow/82452136.cms

No comments