Breaking News

భారతీయ టెకీలకు గుడ్ న్యూస్.. H-1B Visaలపై ముగిసిన ట్రంప్ నిషేధం


హెచ్-1బీ వీసాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో విధించిన నిషేధం గడువు మార్చి 31తో ముగిసింది. ట్రంప్ విధించిన నిషేధాన్ని ప్రస్తుత అధ్యక్షుడు పొడిగించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో భారతీయ ఐటీ నిపుణులకు భారీగా లబ్ధి చేకూరనుంది. మహమ్మారి కారణంగా ఉద్యోగాలకు కోత పడుతోందని, ఈ పరిస్థితుల్లో విదేశీయులకు ఉద్యోగ వీసాలు జారీచేసి తమ యువతను నిరుద్యోగంలోకి నెట్టలేమంటూ... గత ఏడాది జూన్‌లో ట్రంప్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే. తొలుత దీనిని డిసెంబరు వరకు విధించి, తర్వాత ఈ ఏడాది మార్చి 31 వరకూ పొడిగించారు. తాజాగా, ఈ గడువు ముగియడంతో అమెరికా సంస్థలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు మార్గం సుగమమైంది. ట్రంప్ విధించిన వీసా నిషేధాన్ని కొనసాగించరాదని బైడెన్ నిర్ణయించుకున్నట్టు ఆయన యంత్రాంగంలోకి ఓ అధికారి వ్యాఖ్యానించారు. దీనిపై వైట్‌హౌస్ మాత్రం స్పందించడానికి నిరాకరించింది. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత వీసాలపై నిషేధం ఎత్తివేయాలని వ్యాపార వర్గాలు ఒత్తిడి చేస్తున్నాయి. తాజా నిర్ణయం వారికి ఊరట కలిగించనుంది. వ్యవసాయేతర కాలానుగుణ కార్మికులు, అతిథి-కార్మికుల వీసాలపై ట్రంప్ విధించిన ఆంక్షలపై బైడెన్ సమీక్షించనున్నారు. గతంలో గ్రీన్ కార్డుల జారీపై ట్రంప్ ఉత్తర్వులను బైడెన్ వెనక్కు తీసుకున్నారు. ట్రంప్ విధానాలతో అమెరికాలో చట్టబద్ధంగా నివసించే విదేశీయుల సంఖ్య తగ్గిపోయింది. అయితే, ఈ విధానాల వల్ల అమెరికా ఆర్ధిక వ్యవస్థకు మేలు జరుగుతుందని ట్రంప్ అప్పట్లో వాదించారు. ‘దీనికి విరుద్ధంగా చట్టబద్ధమైన శాశ్వత నివాసిత కుటుంబాలను అమెరికా పౌరులుగా మారకుండా నిరోధించడం ద్వారా దేశానికి హాని కలిగిస్తుంది’ అని బైడెన్ అప్పట్లో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను ఉపయోగించుకునే అమెరికాలోని పరిశ్రమలకు కూడా హాని చేస్తుంది అని వ్యాఖ్యానించారు.


By April 02, 2021 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/donald-trumps-h-1b-visa-ban-expire-in-win-for-tech-firms/articleshow/81866929.cms

No comments