Breaking News

భారత్‌కు తక్షణమే టీకా ముడిపదార్థాలు పంపుతాం.. కష్టకాలంలో ఊరటనిచ్చిన అమెరికా ప్రకటన


కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీకి అవసరమైన ముడిపదార్థాల ఎగుమతుల నిషేధం విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. భారత్‌లో పరిస్థితులు దయనీయంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా ఏదో ఒకటి చేయాలని బైడెన్‌కు పలువురు విజ్ఞప్తి చేశారు. భారత్‌లో నెలకున్న ప్రస్తుత పరిస్థితి చూసి మెత్తబడ్డ అగ్రరాజ్యం.. అత్యవసర సాయానికి ముందుకొచ్చింది. కరోనాపై పోరులో భారత్‌కు సహకారం అందజేయడానికి 24 గంటలూ బైడెన్ యంత్రాంగం పనిచేస్తోందని శ్వేతసౌధం వెల్లడించింది. ‘కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి అత్యవసర సాయం అందించేందుకు బైడెన్‌ యంత్రాంగం 24 గంటలూ పనిచేస్తోంది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు అవసరమైన ముడిపదార్థాలను గుర్తించడం, వాటి తక్షణ లభ్యతపై దృష్టి సారించింది’’ అని వైట్‌హౌస్‌ తెలిపింది. భారత్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారులు అజిత్‌ దోవల్‌, జేక్‌సులివాన్‌ మధ్య ఆదివారం జరిగిన టెలిఫోన్‌ సంభాషణల తర్వాత అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. ‘‘కరోనా మహమ్మారి వచ్చిన తొలినాళ్లలో మా ఆస్పత్రులు అలసిపోయినప్పుడు భారత్‌ మాకు సాయం అందించినట్టుగానే.. ఇప్పుడు ఆ దేశానికి అవసరమైన సమయంలో సాయం చేయాలని అమెరికా నిర్ణయించుకుంది’’ నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ఆఫ్‌ వైట్‌హౌస్‌ అధికార ప్రతినిధి ఎమిలీ హోర్న్‌ తెలిపారు. మెడికల్‌ ఆక్సిజన్‌, కరోనా టెస్టింగ్ కిట్లు, పీపీఈ కిట్లు, కొవిడ్‌ రోగుల చికిత్సలో ఉపయోగపడే ఇతర ఔషధాలను భారత్‌కు పంపాలనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని బైడెన్‌ ప్రధాన సలహాదారు (వైద్య విభాగం) ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. అయితే, తమ వద్ద ఉన్న మిగులు వ్యాక్సిన్ల పంపడం గురించి వైట్‌హౌస్ తాజా ప్రకటనలో ప్రస్తావించలేదు. అమెరికా వద్ద 30 మిలియన్ల వరకు ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ టీకాలు అదనంగా ఉన్నాయి. అదనంగా ఉన్న కొవిడ్‌-19 టీకాలను భారత్‌కు పంపకపోవడం పట్ల బైడెన్‌ యంత్రాంగం ఇప్పటికే తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యులు, మద్దతుదారులు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. అయినా సరే తాజా ప్రకటనలో దీని గురించి మాత్రం వెల్లడించలేదు. ఫిబ్రవరిలో టీకా ముడిపదార్థాల ఎగుమతులపై విధించిన నిషేధం విషయంలో పునరాలోచించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ట్విట్టర్‌లో సీరమ్ సీఈఓ అధర్ పునావాలా అభ్యర్థించారు. అమెరికా చట్టసభ సభ్యుడు రాజా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. భారత్‌ సహా మరికొన్ని దేశాల్లో పరిస్థితులు విషమిస్తున్న సమయంలో టీకాలను గిడ్డంగుల్ని ఉంచడం ఏమాత్రం సమంజసం కాదన్నారు. ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు వాటిని అవసరమైన చోటికి తరలించాలని, అమెరికాలో ఇప్పటికే 40 మిలియన్‌ డోసుల ఆస్ట్రాజెనెకా టీకాలు ఉన్నాయన్నాని పేర్కొన్నారు.


By April 26, 2021 at 08:32AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/will-send-raw-material-urgently-required-for-covishield-to-india-says-us/articleshow/82251274.cms

No comments