Breaking News

రైలుకు ఎదురెళ్లి చిన్నారిని కాపాడిన సూపర్ హీరోకు‘జావా’ అద్భుత బహుమతి


తన ప్రాణాలకు ప్రమాదమని తెలిసినా రైలుకు ఎదురెళ్లి రైల్వే ఉద్యోగి మయూర్ షెల్కే ఓ బాలుడి ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మయూర్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. నేషనల్ హీరోగా మారిన మయూర్ షెల్కేని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అభినందించారు. రైల్వే శాఖ రూ.50 వేల నగదు రివార్డు ప్రకటించింది. అలాగే, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ సైతం రూ.50 వేల నగదు బహుమతిని అందజేయనున్నట్టు తెలిపింది. తన ప్రాణాలను ఫణంగా పెట్టి రైలుకు ఎదురెళ్లి చాకచక్యంగా బాలుణ్ని కాపాడిన షెల్కేకు ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ జావా.. బైక్‌ను బహుమతిగా ఇవ్వనుంది. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అనుపమ్ థరేజా ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ‘‘మయూర్ షెల్కే ధైర్యసాహసాలు ప్రశంసనీయమం.. మొత్తం జావా కుటుంబం ఆయనను అభినందిస్తోంది... రైలు దూసుకొస్తున్నప్పటికీ బాలుడిని సురక్షితంగా కాపాడిన తీరు తమను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.. ఆయనను జావా హీరోస్ ఇనీషియేటివ్‌లో భాగంగా అవార్డుతో సత్కరించాలని నిర్ణయించాం’’ అనుపమ్ థరేజా ట్వీట్ చేశారు. దేశవ్యాప్తంగా ఇలాంటి హీరోలను గుర్తించి జావా హీరోస్ పేరుతో సత్కరిస్తామని తెలిపారు. షెల్కే సాహసంపై ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. సినిమాల్లోని సూపర్ హీరోలను మించిన హీరోగా అద్భుతమన ధైర్య సాహసాలను ప్రదర్శించారంటూ ట్విట్టర్‌లో అభినందించారు. తన సాహసంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న మయూర్ షెల్కే మరోసారి తన నిర్ణయంతో అందర్నీ కట్టిపడేశారు. తనకు లభించిన నగదు బహుమతుల్లో సగం మొత్తం తాను కాపాడిన బాలుడి చదువుకోసం అందజేస్తున్నట్టు ప్రకటించారు. రైల్వే, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ ప్రకటించిన లక్ష రూపాయల బహుమతిలో రూ.50వేలు ఇస్తున్నట్లు తెలిపారు. ఆ బాలుడి తల్లికి కళ్లు సరిగ్గా కనిపించకపోవడంతే పిల్లాడు రైల్వే ట్రాక్‌పై పడిపోయినా.. ఆమె ఏం చేయలేకపోయిందని మయూర్ తెలిపారు. ‘బాలుణ్ని కాపాడిన అనంతరం ఆ మహిళ ఎంతో భావోద్వేగానికి గురయ్యారు. నాకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్‌ కూడా ఫోన్‌ చేసి అభినందించారు’ అని షెల్కే తెలిపారు. ముంబై డివిజన్‌లోని వాంగై రైల్వే స్టేషన్‌లో ఏప్రిల్‌ 17న.. ఆరేళ్ల బాలుడు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోగా.. పాయింట్స్‌మన్‌ మయూర్‌ షెల్కే చిన్నారిని రక్షించిన విషయం తెలిసిందే. మయూర్‌ అసమాన సాహసోపేత దృశ్యం అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో మయూర్‌ ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ముంబైలోని సెంట్రల్‌ రైల్వే కార్యాలయంలో అధికారులు, సిబ్బంది చప్పట్లతో మయూర్‌ను అభినందించారు. చిన్నారి ప్రాణాల్ని కాపాడి.. ఆయన చేసిన సాహసం వెలకట్టలేనిదన్నారు.


By April 22, 2021 at 10:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jawa-motorcycle-ltd-to-honour-railways-hero-mayur-shelke-with-a-new-bike/articleshow/82192281.cms

No comments