అనారోగ్యంతో కన్నుమూసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి

న్యాయమూర్తి జస్టిస్ ఎం శంతన్గౌండర్ ఆదివారం ఉదయం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన గురుగావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జస్టిస్ శంతన్గౌడర్ వయసు 62 ఏళ్లు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో చికిత్స కోసం ఆయన.. మేదాంత హాస్పిటల్లో చేరారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయనకు ఐసీయూలో చికిత్స అందజేశారు. అయితే, శనివారం రాత్రి వరకూ ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. కానీ, అర్ధరాత్రి 12 గంటల తర్వాత పరిస్థితి విషమించింది. ఆదివారం తెల్లవారుజామున 3.00 గంటలకు జస్టిస్ శంతన్గౌడర్ మృతిచెందినట్టు కుటుంబానికి సమాచారం అందించారు. ఆయనకు కరోనా సోకిందా? లేదా? అనేది మాత్రం ధ్రువీకరించలేదు. కర్ణాటకు చెందిన జస్టిస్ శంతన్గౌడర్ 2017, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆయన పదవీకాలం 2023 మే 4 వరకు ఉంది. ఇక, 1958 మే 5న కర్ణాటకలో జన్మించిన జస్టిస్ శంతన్గౌడర్.. 1980 సెప్టెంబరు 5 న్యాయవాద వృత్తిని చేపట్టారు. అంచలంచెలుగా ఎదుగుతూ 2003 మే 12న కర్ణాటక హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమితులయ్యారు. తర్వాత 2004 సెప్టెంబరులో శాశ్వత న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఆగస్టు 1, 2016లో కేరళ హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ శంతన్గౌడర్.. అనంతరం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సెప్టెంబరు 22, 2016న కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి.. 2017 ఫిబ్రవరి వరకూ ఆ పదవిలో ఉన్నారు. తర్వాత సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.
By April 25, 2021 at 08:42AM
No comments