Breaking News

చత్తీస్‌గడ్: వాహనాల కొరత.. చెత్త బండ్లలో శ్మశానాలకు మృతదేహాల తరలింపు


కోవిడ్ మహమ్మారి దెబ్బకు చత్తీస్‌గఢ్ చిగురుటాకులా వణుకుతోంది. కరోనా రోగులతో ఆస్పత్రులు నిండిపోగా.. మార్చురీల వద్ద మృతదేహాలు గుట్టలుగా పోగుపడుతున్నాయి. ఆంత్యక్రియలకు శ్మశానాలు సరిపోవడంలేదు. మృతదేహాలను తరలించడానికి వాహనాలు కరవవుతున్నాయి. రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో కరోనా కారణంగా చనిపోయినవారి మృతదేహాలను తరలించేందుకు వీధుల్లో చెత్తను తీసుకెళ్లే వాహనాల్లో తరలించారు. చెత్త బండిలోనే శ్మశానానికి తీసుకెళ్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫ్రంట్‌లైన్ వర్కర్లు పీపీఈ కిట్లు ధరించి, మృతదేహాలను చెత్త బండిలోకి వేస్తున్నారు. ఈ ఘటనపై చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్‌‌ను వివరణ కోరగా.. నగర పంచాయతీ, సీఎంఓలు వాహనాన్ని ఏర్పాటుచేశారని, దీనికి బాధ్యులు వారేనని తెలిపారు. రాజ్‌నంద్‌గావ్‌లో కోవిడ్ కేసులు భారీగా నమోదవుతుండగా.. ఆస్పత్రుల్లో బెడ్‌‌ల కొరత ఏర్పడింది. దీంతో అక్కడ ప్రెస్ క్లబ్‌ను కోవిడ్ కేర్ సెంటర్‌గా మార్చారు. అసిమ్టమాటిక్ రోగుల కోసం 30 పడకలను ఏర్పాటుచేశారు. ఏప్రిల్ 13న కరోనాకు చికిత్స కోసం ఇద్దరు అక్కాచెల్లెళ్లతో పాటు ముగ్గురు బాధితులు డోంగర్‌గావ్ కోవిడ్ కేర్ సెంటర్‌లో చేరారు. వీరికి సకాలంలో ఆక్సిజన్ అందకపోవడంతో మృతి చెందారు. ఇక, రాయ్‌పూర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి మృతదేహాలతో నిండిపోయింది. ఎటుచూసినా మృతదేహాలతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆస్పత్రిలో మృతదేహాలను భద్రపరచడానికి కూడా ఖాళీలేదు. ఎక్కడ ఖాళీ దొరుకుందా అని ఆస్పత్రి సిబ్బంది ఎదురుచూస్తున్నారు. చత్తీస్‌గఢ్‌లో బుధవారం 14,250 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా, 120 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,86,244కి చేరగా.. మరణాలు 5,307గా ఉన్నాయి. గత నెలలో అక్కడ మొత్తం 1.68 లక్షల కేసులు నమోదు కాగా,, 1,417 మంది ప్రాణాలు కోల్పోయారు.


By April 15, 2021 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/garbage-van-ferries-covid-patients-dead-bodies-to-cremation-in-chhattisgarh/articleshow/82076858.cms

No comments