Breaking News

మొన్న ఆక్సిజన్ ట్యాంకర్.. నేడు అంతిమ యాత్ర బండ్ల వద్ద బీజేపీ నేతల ఫోటో షూట్!


కరోనాతో జనం అల్లాడిపోతుంటే ఆక్సిజన్ ట్యాంకర్ల, అంత్యక్రియల వాహనాల ముందు మధ్యప్రదేశ్ బీజేపీ నేతలు ఫోటో షూట్‌లకు దిగడం విమర్శలకు దారితీస్తోంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో రెండు రోజుల కిందట ఆక్సిజన్ ట్యాంకర్‌ను బీజేపీ నేతలు అరగంట పాటు ఆపి ఫోటోలకు ఫోజులిచ్చి, ఉపన్యాసాలు దంచికొట్టిన ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లో బీజేపీ నేత, మాజీ మేయర్ అలోక్‌ శర్మ మృతదేహాలను తరలించే వాహనాల ముందు నిలుచుని అలోక్ ఫొటోలు తీయించుకున్నారు. ఈ ఉదంతంపై ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. పూర్వాపరాల్లోకి వెళితే అలోక్ శర్మ భోపాల్‌లోని ఆరు ప్రముఖ ఆసుపత్రులకు ఆరు అంతిమయాత్ర వాహనాలను అందజేశారు. ఈ సమయంలో ఆయనతో పాటు జేపీ ఆసుపత్రి సీనియర్ వైద్యులు, స్థానిక బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. ఆసుపత్రి నిర్వాహకులకు అంతిమయాత్ర వాహనాలను అప్పగించేముందు వాటిని వరుసగా ఉంచారు. తరువాత మాజీ మేయర్ అలోక్ శర్మ ఆ వాహనాల ముందు నిలుచుని ఫొటోలు తీయించుకున్నారు. అనంతరం ఆ వాహనాలు అక్కడి నుంచి తరలివెళ్లాయి. అయితే, ఈ ఫొటోల్లోని వాహనాల డ్రైవర్లు పీపీఈ కిట్‌లు ధరించి ఉండటంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. తీవ్రత ప్రమాదకరంగా ఉంది. గత 15 రోజుల్లోనే 600 మంది ప్రాణాలు కోల్పోయారు. శ్మశానాల వద్ద దృశ్యాలు చాలా భయంకరంగా ఉన్నాయి. మృతదేహాలకు అంత్యక్రియల కోసం క్యూలైన్‌లో వేచి ఉంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత ఫోటో షూట్‌కు దిగడం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ నేత నరేంద్ర సలూజా ఒక ట్వీట్ చేస్తూ... ‘‘కోవిడ్ సంక్షోభం సమయంలోనూ చీప్ పబ్లిసిటీని వదలిపెట్టడం లేదు.. ఆ పార్టీ నేతలు సిగ్గుపడాలి... మొన్న ఇండోర్‌లో ఆక్సిజన్ ట్యాంకర్‌ను అరగంట పాటు నిలిపివేసి ఫోటోలకు దిగిన బీజేపీ నేతలు... ఇప్పుడు భోపాల్‌లోనూ ఇదే పని చేశారు. ఇటువంటి క్లిష్ట సమయంలో ఫొటోషూట్ అవసరమా?’’ అని ప్రశ్నించారు. కాగా ఈ ఆరోపణలను బీజేపీ నేత అలోక్ శర్మ ఖండించారు. మృతదేహాలను అంత్యక్రియలకు తరలించే వాహనాల కొరత ఉందని గుర్తించి వాటిని తానే సమకూర్చినట్టు తెలిపారు. నగరంలోని భాద్భాదా, సుభాష్ నగర్ శ్మశాన వాటికలో వాహనాలు కొరత ఉంది.. చాలా మంది బాధితులు బయట ప్రాంతాల నుంచి వచ్చారు.. మున్సిపల్ ఉద్యోగులు వారి మృతదేహాలను ఆసుపత్రి నుంచి దహన సంస్కారాల కోసం తరలించడానికి గంటలు పడుతుంది’’అని ఆయన చెప్పారు. మొత్తం ఆరు ప్రభుత్వ ఆస్పత్రులకు వాహనాలను ఇచ్చామని, 21 లారీల కలపను కూడా అంత్యక్రియలకు అందజేశామన్నారు.


By April 20, 2021 at 12:57PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-leaders-hold-photo-shoot-with-covid-hearses-in-bhopal/articleshow/82159011.cms

No comments