Breaking News

ఢిల్లీలో లాక్‌డౌన్.. నేటి రాత్రి నుంచే అమల్లోకి: కేజ్రీవాల్ సంచలన నిర్ణయం


ఢిల్లీలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. సోమవారం రాత్రి నుంచే లాక్‌డౌన్ అమల్లోకి రానున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 26 ఉదయం వరకు లాక్‌డౌన్ కొనసాగనుతుందని ఈ మేరకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన చేశారు. ప్రస్తుతం ఢిల్లీలో రాత్రిపూట కరోనా కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో పరిస్థితుల దృష్ట్యా లాక్‌డౌన్ తప్పనిసరని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కరోనా పరిస్థితులపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెస్టుల సామర్థ్యాన్ని పెంచామని, ఇప్పటికే ఐసోలేషన్ బెడ్‌లు పూర్తిగా నిండిపోయాయని సీఎం తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి ఘోరంగా ఉందని, రోజుకు 25 వేల మందికి వైరస్ నిర్ధారణ అవుతోందన్నారు. ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ కొరత ఉందన్నారు. కోవిడ్ పరీక్షలు, కేసుల విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. ప్రస్తుత కష్టకాలంలో ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు సమిష్టిగా ఉండాలని అన్నారు. ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉందో చెబుతున్నామని, భయపెట్టడం మా ఉద్దేశం కాదని కేజ్రీ పేర్కొన్నారు. అన్ని ప్రయివేట్ కార్యాలయాలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని, కేవలం ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే పనిచేస్తాయని తెలియజేశారు. ప అత్యవసర సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. వలస కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలందరూ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని చేతులు జోడించి వేడుకుంటున్నానని సీఎం అభ్యర్ధించారు. మరోవైపు, కరోనా బాధితులు పెరుగుతుండటంతో ఆస్పత్రుల్లో ఆక్సిజన్, రెమ్‌డెసివిర్ ఔషధం కొరత ఏర్పడింది. వీటి పర్యవేక్షణకు తొమ్మిది మంది అధికారులతో కూడిన రెండు బృందాలను కేజ్రీ సర్కారు నియమించింది. ఆదివారం ఢిల్లీలో 25,462 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది.. మరో 161 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో పాజిటివిటీ రేటు 29.74 శాతానికి చేరుకుంది. నగరంలోని సేకరించిన నమూనాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి వైరస్ నిర్ధారణ అవుతోంది. నాలుగు రోజుల కిందట 16 శాతంగా ఉన్న పాటిటివిటీ రేటు ఏకంగా 30 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఢిల్లీలో చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కరోనాకి కూడా కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయే పరిస్థితి వచ్చింది. కరోనా కట్టడికి రాత్రిపూట కర్ఫ్యూ, వారాంతపు లాక్‌డౌన్ నాలుగు రోజుల కిందటే కేజ్రీవాల్ విధించారు. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. తాను లాక్‌డౌన్‌కు వ్యతిరేకమని, ఒకవేళ ఆరోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోతే చివరి అస్త్రంగా మాత్రమే పరిగణించాలని ఇటీవల కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.


By April 19, 2021 at 12:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/total-lockdown-in-delhi-from-tonight-till-next-monday-morning-says-arvind-kejriwal/articleshow/82140603.cms

No comments