Breaking News

మాజీ హోం మంత్రి, మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్


అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు, ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. దేశ్‌ముఖ్‌ విషయంలో ముంబయి మాజీ పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌సింగ్‌ చేసిన ఆరోపణలపై దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. వీటిని రద్దుచేయాలని కోరుతూ వేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ముంబయిలోని హోటళ్లు, బార్లు, హుక్కా సెంటర్ల నుంచి నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీస్‌ అధికారులకు దేశ్‌ముఖ్ నిర్దేశించారని పరంబీర్ సింగ్ ఆరోపించారు. బాంబే హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో మహారాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేయగా.. దీనిపై జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ ఆరోపణలు చాలా తీవ్రమైనవి. ఒకరేమో హోం మంత్రి, మరొకరు సీపీ.. అలాంటప్పుడు సీబీఐ దర్యాప్తు అవసరం లేదా? తమ పదవుల నుంచి తప్పుకునేదాకా ఇద్దరూ కలిసి పనిచేసినవారే. ఆరోపణలు రాగానే అనిల్ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయలేదు. బాంబే హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించేంత వరకూ పదవిని అట్టిపెట్టుకున్నారు.. ఇది కార్పొరేట్ లేదా రాజకీయ వైరంతో ఉన్న కేసు కాదు.. ఆయనకు అన్నాళ్లూ కుడిభుజంగా ఉన్న వ్యక్తి ఆరోపణలు చేశారు. కాబట్టి వీటిపై స్వతంత్ర సంస్థ దర్యాప్తు అవసరమే. హైకోర్టు కూడా ప్రాథమిక దర్యాప్తు మాత్రమే జరిపి 15 రోజుల్లోగా విషయాన్ని తేల్చమంది. దాన్ని నిలిపేయడమెందుకు?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. బయటి సంస్థలు దర్యాప్తు చేయాలని ఓ నిందితుడు కోరడం సరైనదేనా? అని దేశ్‌ముఖ్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబాల్‌ను బెంచ్‌ ప్రశ్నించగా.. ‘దేశ్‌ముఖ్‌ నిందితుడూ కాదు, అనుమానితుడూ కాదు. ఎలాంటి ఆధారాల్లేకుండా ఇక్కడా అక్కడా విన్న మాటలు విని ఈ కేసులు వచ్చాయి. దేశ్‌ముఖ్‌తో మీటింగ్‌లో పాల్గొన్న సచిన్‌ వాజే ఒక వ్యక్తికి ఆ వివరాలు చెప్పారట. ఆయనేమో ఛగన్‌ భుజ్‌బల్‌కు చెప్పారట. ఆయన సీపీకి చేరవేశాట్ట. సీపీ పరమ్‌బీర్‌ సింగ్‌ ఈ విషయాన్ని తనపై బదిలీ వేటు పడ్డాక బయటపెట్టాట్ట. ఇదంతా మాటలపోగే తప్ప ఆధారాల్లేని విషయం’ అని సిబాల్‌వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించని ధర్మాసనం.. సీబీఐ దర్యాప్తునకు బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సమర్దించింది. మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున మరో సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. బాంబే హైకోర్టు ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా విచారణకు ఆదేశించడం దుస్సంప్రదాయమని వాదించారు. ఈ సందర్భంగా బిర్లా-సహారా డెయిరీ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహారించిన సింఘ్వి.. చట్టం అందరికీ సమానమేనని పేర్కొన్నారు.


By April 09, 2021 at 07:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/blow-to-anil-deshmukh-and-maharashtra-govt-as-cbi-gets-sc-go-ahead/articleshow/81980052.cms

No comments