Breaking News

ప్రజలతో నిజాయితీగా మెలగండి.. అప్పుడే నమ్ముతారు: ప్రభుత్వానికి గుజరాత్ హైకోర్టు అక్షింతలు


కేసులు, మరణాలు, పరీక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరును ఇటీవల తెలంగాణ హైకోర్టు ఆక్షేపించిన విషయం తెలిసిందే. తాజాగా, కోవిడ్ పరీక్షలు, కేసుల విషయంలో గుజరాత్ హైకోర్టు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజలతో నిజాయితీగా వ్యవహరించాలని, కోవిడ్ మరణాల సంఖ్యపై పారదర్శకంగా ఉండాలని హైకోర్టు సూచించింది. ఆర్టీ-పీసీఆర్ టెస్టింగ్ ఫలితాలను కచ్చితంగా ప్రకటించాలని తెలిపింది. వాస్తవాలను దాచిపెట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రయోజనం ఉండదని సూచించింది. కచ్చితమైన సమాచారాన్ని దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని స్పష్టం చేసింది. గుజరాత్‌లో కోవిడ్-19 పరిస్థితులపై హైకోర్టు స్వీయ విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ భార్గవ్ కరియా ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. కరోనా కట్టడికి కొన్ని సూచనలు చేసిన ధర్మాసనం.. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌ల ఫలితాలను సరైనవిధంగా, కచ్చితంగా ప్రకటించాలని తెలిపింది. ఈ ఫలితాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడానికి వెనుకాడవద్దని స్పష్టం చేసింది. కచ్చితమైన సమాచారాన్ని దాచిపెట్టడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతుందని, దీనివల్ల ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారని వ్యాఖ్యానించింది. పరిస్థితులను చక్కదిద్దాలంటే ప్రభుత్వాలు ప్రజలతో పారదర్శకంగా, నిజాయితీగా వ్యవహరించాలని హితవు పలికింది. కోవిడ్ రోగుల సంఖ్య పెరగడానికి ప్రభుత్వం బాధ్యులు కాదు.. కానీ, వాస్తవ సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలని తెలిపింది. వాస్తవాలను వెల్లడించడం వల్ల ప్రయోజనాలను వివరించిన హైకోర్టు... ప్రభుత్వం కచ్చితమైన సమాచారాన్ని బయటపెట్టడం లేదనే భావనను ప్రజల మనసుల నుంచి తొలగించడానికి వీలవుతుందని తెలిపింది. ‘‘కోవిడ్ సంరక్షణ కేంద్రాలలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, మందులు మొదలైనవి కోవిడ్ రోగుల చికిత్స కోసం అవసరమైన సౌకర్యాలు, సంబంధిత మౌలిక సదుపాయాల లభ్యత, విధానాలకు సంబంధించి బహిరంగంగా పారదర్శకంగా పూర్తి వివరాలను వెల్లడించాలి’’ అని పేర్కొంది. సౌకర్యాలు, వనరుల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం వల్ల ఔషధాలు వంటివి బ్లాక్ మార్కెట్‌కు తరలిపోకుండా ఉంటాయని వ్యాఖ్యానించింది. కోవిడ్ కేసులు ఉప్పెనలా పెరుగుతున్న సమయంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, మందులు, చికిత్సా సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయత్నాల గురించి ప్రజలకు తెలియజేయాలని ధర్మాసనం వివరించింది. కాగా, అసర్వ సివిల్ హాస్పిటల్ వద్ద శుక్రవారం అంబులెన్సులు బారులు తీరి కనిపించాయి. వీటిలో కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినవారి మృతదేహాలు ఉన్నాయి. ఈ మృత దేహాలను తీసుకునేందుకు బంధువులు పడిగాపులు కాస్తున్నారు.


By April 17, 2021 at 03:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/give-real-covid-picture-hiding-will-cause-serious-problem-says-gujarat-high-court/articleshow/82116964.cms

No comments