Breaking News

మావోల పద్మవ్యూహంలో జవాన్లు చిక్కి.. చిత్రహింసలకు గురయ్యి: ఎన్‌కౌంటర్‌లో సంచలన నిజాలు


ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్ ఘాతుకానికి బలైన జవాన్లు సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకూ 24 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో జల్లెడపడుతున్నారు. ఇదిలా ఉండగా, శనివారం జరిగిన ఘటన గురించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టులు పక్కా పథకంతోనే భద్రతా బలగాలను ఉచ్చులోకి లాగి అత్యంత పాశవికంగా పొట్టనబెట్టుకున్నారు. మావోయిస్ట్ అగ్రనేత, మోస్ట్ వాటెండ్ మడ్వి హిడ్మా.. తారెమ్ అటవీ ప్రాంతంలో దాక్కున్నట్లు ఓ పుకారు సృష్టించి, భద్రతా దళాలను ట్రాప్ చేశారు. హిడ్మా ఆ ప్రాంతంలో ఉన్నాడని భావించిన భద్రతా దళాలు కూంబింగ్ నిర్వహించాయి. అప్పటికే మాటువేసిన మావోయిస్టులు భధ్రతా సిబ్బందిపై మెరుపు దాడి చేశారు. తారెమ్ అటవీ ప్రాంతంలో మావోలు ‘U’ అక్షరం ఆకారంలో మోహరించారు. ఓవైపు నుంచి భద్రతా సిబ్బంది ప్రవేశించగానే.. మూడు వైపుల నుంచి బుల్లెట్ల వర్షం కురిపించారు. అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు మావోలు ఉచ్చులోకి తమ తెలియకుండానే చిక్కుకుపోయారు. ఊహించని ఆ దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఎదురు కాల్పులు ప్రారంభించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చాలా మంది జవాన్లు బుల్లెట్ గాయాలతో నేలకొరిగారు. మరికొందరు ప్రాణ భయంతో అడవుల్లోకి పారిపోయారు. బుల్లెట్ గాయాలతో పడి ఉన్న ఓ జవాన్‌కు చేతులు నరికి.. చిత్రహింసలకు గురిచేసి మావోలు హత్యచేసినట్టు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అంతేకాదు గాయాలైన జవాన్లలో చాలా మంది కొన్ని గంటల ప్రాణాలతోనే ఉన్నారు. ఎక్కువ సేపు ఎదురుకాల్పులు జరగడంతో వారిని ఆస్పత్రికి తీసుకెళ్లడం కష్టమయింది. దీనికి తోడు ఎండ వల్ల డీహైడ్రేషన్‌కు గురై పలువురు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన జవాన్ల నుంచి ఆయుధాలు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లాక్కొని మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు. దాడికి మావోయిస్టులు భారీ సంఖ్యలో మారణాయుధాలు వాడినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. లైట్ మెషీన్ గన్స్, అండర్ బ్యారెల్ గ్రెనేడ్ లాంచర్స్‌తో పాటు దేశీ రాకెట్స్ ఉపయోగించారని అన్నారు. లైట్ మెషీన్ గన్స్ వల్లే ఎక్కువ ప్రాణనష్టం జరిగిందని చెప్పారు.


By April 05, 2021 at 07:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/security-personnel-die-in-u-shaped-maoist-ambush-says-chhattisgarh-police/articleshow/81905320.cms

No comments