Breaking News

చిలీ కొంప ముంచిన చైనా టీకా.. దానికి తోడైన స్వయంకృతం, నిర్లక్ష్యం..!


‘కోవిడ్ టీకా వేయించుకున్నాం.. ఇంకేం కాదులే !’ అని జనం విచ్చలవిడిగా తిరిగితే ఏమవుతుందనే దానికి చిలీ చక్కటి ఉదాహరణ. ప్రపంచంలోనే అత్యధిక శాతం మంది పౌరులకు టీకాలు ఇచ్చిన తొలి ఐదు దేశాల్లో చిలీ మూడో స్థానంలో ఉంది. ఈ స్థానం చూసి సంబరపడాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రారంభమైన తర్వాత నుంచి విచిత్రంగా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. దీనికి గత కారణాలను అన్వేషించగా.. ప్రజల స్వయంకృతం.. నిర్లక్ష్యం అని తేలింది. వాస్తవానికి కరోనాపై పోరాటంలో టీకాలు రామబాణాలు కాదని వైద్యులు, నిపుణులు నెత్తీనోరు బాదుకొని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకొన్నా వైరస్ రాకుండా ఆపలేమని.. కేవలం ఇన్ఫెక్షన్‌ నుంచి వచ్చే దుష్పరిణామాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొంటున్నారు. టీకాలు, మాస్క్‌లు, శానిటైజర్లు, భౌతిక దూరం వంటివి తూ.చ తప్పకుండా అమలు చేసి మాత్రమే వైరస్‌ను జయించవచ్చని హెచ్చరిస్తున్నారు. చిలీ ప్రజలు చాలా నిర్లక్ష్యపు పనులను కట్టకట్టుకొని ఒకేసారి చేయడంతో ఆ ఫలితం అనుభవిస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కేసులు తగ్గుముఖం పట్టగానే ప్రజలు కోవిడ్ నిబంధనలను గాలికొదిలేయడం మొదలుపెట్టారు. క్రిస్మస్‌ సీజన్‌లో షాపింగ్‌ మాల్స్‌కు ఎగబడ్డారు. పర్యాటక స్థలాలు రద్దీగా మారాయి. విదేశీ యాత్రలకు వెళ్లిన వారు ఇతర కరోనా రకాలను అంటించుకొని దేశానికి తిరిగొచ్చారు. ఫలితంగా జనవరి మొదటి నుంచి కేసుల గ్రాఫ్‌ క్రమంగా పెరుగుతూ వచ్చింది. పరీక్షలు చేయించుకోవడంలో కూడా నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా దేశం మొత్తం వైరస్‌ పాకిపోయింది. చీలి విస్తీర్ణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కంటే పెద్దగా ఉన్నా అక్కడ జనాభా కేవలం రెండు కోట్లు. ‘చిలీ’ అంటే స్థానిక ఆదిమ జాతి మాపుచి భాషలో ‘భూమి అంతమయ్యే ప్రదేశం’అని అర్ధం. ఇప్పుడు అక్కడి ప్రభుత్వ, ప్రజల నిర్లక్ష్యంతో కరోనా వాక్సినేషన్‌పై ఆశలు అంతమయ్యే ప్రదేశంగా మారింది. దీనికి వాడకం కూడా తోడయ్యాయి. అక్కడ జనాభాలో 40 శాతం మందికి ఇప్పటికే టీకా తొలి డోస్ అందజేశారు. ఇజ్రాయేట్, బ్రిటన్ తర్వాత ఆ దేశంలోని ప్రజలే పెద్ద సంఖ్యలో టీకా తీసుకున్నారు. ప్రస్తుతం చిలీలో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఏప్రిల్ 9న అత్యధికంగా 9 వేల కేసులు బయటపడగా.. అక్కడ వైరస్ మొదలైన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో వైరస్ నిర్ధారణ కావడం ఇదే తొలిసారి. గతేడాది మార్చి నుంచి నవంబరు వరకు సరిహద్దులు మూసివేసి, కఠిన ఆంక్షలు అమలుచేయడంతో వైరస్ అదుపులో ఉంది. తర్వాత ఆంక్షలు సడలించి, ఆర్ధిక కార్యకలాపాలు పునరుద్ధరించడంతో వైరస్ వ్యాప్తి పుంజుకుంది. దీంతోపాటు చైనా వ్యాక్సిన్ కూడా చిలీ కొంప ముంచింది. పెద్ద సంఖ్యలో చైనా సంస్థ సైనోవ్యాక్ ఉత్పత్తి చేసిన కరోనావ్యాక్‌ డోస్‌లను వినియోగించారు. అయితే, ఈ టీకా పనితీరు అంతంతమాత్రంగానే ఉన్నట్టు ఇటీవలే స్వయంగా చైనా సీడీసీ వెల్లడించింది. తాము అభివృద్ధి చేసిన టీకాల సామర్థ్యం చాలా తక్కువని, మిగతా వాటిని కలిపి వినియోగించడంపై పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. చైనా టీకాల 50 శాతం మేర మాత్రమే సమర్ధవంతంగా పనిచేస్తున్నట్టు బ్రెజిల్ అధ్యయనంలో తేలింది. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెన్‌కా వంటి టీకాల కంటే దీని సమర్ధత చాలా స్వల్పమే. చిలీలో వైరస్ విజృంభణకు ప్రజల నిర్లక్ష్యానికి తోడు చైనా టీకా కారణమయ్యాయి.


By April 20, 2021 at 12:05PM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/chile-has-one-of-the-worlds-best-vaccination-rates-but-covid-is-surging-there-anyway/articleshow/82158147.cms

No comments