కష్టకాలంలో భారత్కు అండగా ఉంటాం.. సాయం ప్రకటించిన పాక్

కరోనా మహమ్మారి విజృంభణతో అల్లాడుతున్న భారత్కు సాయమందించడానికి పలు దేశాలు ముందుకొస్తున్నాయి. పొరుగు దేశం పాకిస్థాన్ కూడా తనవంతు సాయం అందించేందుకు సిద్ధమయ్యింది. భారత్కు తక్షణ సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషి ట్విటర్ ద్వారా వెల్లడించారు. అటు, పాక్ ప్రధాని ఇమ్రాన్ సైతం ట్విట్టర్ ద్వారా కరోనా వైరస్పై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలిపారు. ‘కోవిడ్ రెండోదశ విజృంభణపై పోరాటం చేస్తున్న భారత్కు సంఘీభావం తెలియజేస్తున్నాం.. ప్రస్తుత పరిస్థితుల్లో పొరుగుదేశానికి మావంతు సాయంగా వెంటిలేటర్లు, డిజిటల్ ఎక్స్రే యంత్రాలు, పీపీఈ కిట్లు ఇతర వైద్య సామాగ్రి అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం.. అవి తక్షణమే భారత్కు అందేలా ఇరు దేశాలకు చెందిన సంబంధిత అధికారులు కృషి చేయాలి.. అంతేకాకుండా కరోనాపై పోరులో సాయానికి ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలి’ అని ఖురేషి ట్విట్టర్లో పేర్కొన్నారు. ‘కరోనా వైరస్ రెండో దశపై పోరాటం చేస్తున్న భారత ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నాం. పొరుగుదేశం సహా ఇతర దేశాలు మహమ్మారి బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాం.. ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఈ సవాల్పై అందరూ కలసికట్టుగా యుద్ధం చేయాలి’ అని ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్లో పిలుపునిచ్చారు. భారత్లో కరోనా వైరస్ రెండోదశ కల్లోలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. వరుసగా నాలుగు రోజుల నుంచి రోజువారీ మూడు లక్షలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. కరోనాతో ఇప్పటి వరకూ 1,92,310 మంది బలయ్యారు. ఈ క్రమంలో అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాలు భారత్కు సంఘీభావం ప్రకటించాయి. సాయం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయా దేశాలు తెలిపాయి.
By April 25, 2021 at 10:41AM
No comments