Breaking News

కశ్మీర్: రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లు.. ఐదుగురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత చర్యలను సైన్యం మరింత ముమ్మరం చేసింది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు ఉగ్రవాదులను వేర్వేరు ఎన్‌కౌంటర్‌లలో సైన్యం హతమార్చింది. గురువారం మధ్యాహ్నం షోపియాన్‌ పట్టణంలోని బాబా మొహల్లా ప్రాంతంలో ముష్కరులు సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. బలగాలు కూడా ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడినట్టు అధికారులు తెలిపారు. తాజాగా, అవంతిపొరలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు. త్రాల్‌లోని నోబగ్ వద్ద ఓ ప్రార్ధనా మందిరంలో ఉగ్రవాదులున్నట్టు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు ఆ ప్రాంతానికి చేరకుని చుట్టుముట్టాయి. వారిని లొంగిపోవాలని సైన్యం పదే పదే విజ్ఞ‌ప్తిచేసినా తీవ్రవాదులు లక్ష్యపెట్టలేదు. దీనికి స్థానికుల సాయాన్ని కూడా సైన్యం తీసుకుంది. ఓ తీవ్రవాది కుటుంబసభ్యుడు, స్థానిక ఇమామ్ సాహెబ్‌లను వారి వద్దకు పంపారు. ప్రార్థనా మందిరంలో దాక్కున్నవారిని నచ్చజెప్పి తీసుకురావడానికి సైన్యం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లొంగిపోవాలన్న విజ్ఞ‌ప్తికి ముష్కరులు అంగీకరించకుండా.. భద్రతా బలగాలపై కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన సైన్యం.. ఎదురుకాల్పులు జరపడంతో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఇద్దరు తీవ్రవాదులను హతమైనట్టు అధికారులు తెలిపారు. ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలను తర్వాత వెల్లడిస్తామని పేర్కొన్నారు.


By April 09, 2021 at 09:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-terrorist-killed-in-different-encourts-with-in-24-hours-at-jammu-and-kashmir/articleshow/81981069.cms

No comments