Breaking News

గదిలో ఉరేసుకున్న కోడలు.. నీచానికి పాల్పడిన అత్తమామలు, వీళ్లు మనుషులేనా!


ఎవరైనా మన కళ్లముందు ఆత్మహత్యకు యత్నిస్తే ఏం చేస్తాం.. వాళ్లను కాపాడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తాం.. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ దంపతులు మాత్రం కనికరం లేకుండా ప్రవర్తించారు. వేధింపులు భరించలేక తమ కళ్లెదుటే కోడలు ఉరేసుకుంటుంటే అత్తమామలు సెల్‌ఫోన్లో వీడియో తీశారు. ఈ రాక్షస ఘటన ఉత్తర ప్రదేశ్‌‌లోని ముజఫర్‌‌నగర్‌ జిల్లాలో జరిగింది. డాటియానా గ్రామానికి చెందిన కోమల్‌ అనే యువతికి ఆశిష్‌‌తో 2019లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో కోమల్ తల్లిదండ్రులు 5 లక్షలు నగదు, ఓ బైక్‌ని కట్నం కింద ఇచ్చారు. ఆరు నెలలుగా భర్త, అత్తమామలు అదనపు కట్నం తీసుకురావాలంటూ కోమల్‌ని వేధిస్తున్నారు. తాము కోరినంత కట్నం తీసుకురాకపోతే ఇంట్లో నుంచి వెళ్లగొడతామని బెదిరిస్తూ శారీరకంగా, మానసికంగా చిత్రహింసలు పెడుతున్నారు. అత్తింటి పోరును తట్టుకోలేకపోయిన కోమల్‌ ఇటీవల పుట్టింటికి వెళ్లిపోగా పెద్దలు సయోధ్య కుదిర్చి మళ్లీ ఆమెను కాపురానికి పంపించారు. అయితే కొద్దిరోజులకే ఆశిష్, అతడి తల్లిదండ్రులు ఆమె మళ్లీ వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. సోమవారం భర్త ఇంట్లో లేని సమయంలో బెడ్రూమ్‌లో ఉరేసుకునేందుకు సిద్ధం చేసుకుంది. కోడలు ఉరేసుకోవడాన్ని చూసిన అత్తమామలు ఆపకపోగా.. ఆ తతంగాన్ని సెల్‌ఫోన్లో వీడియో తీశారు. విచారణలో పోలీసులు వారిని ప్రశ్నించగా.. కోడలి ఆత్మహత్యతో తమకెలాంటి సంబంధం లేదని, ఆమే స్వయంగా ఉరేసుకుందని తాము తీసిన వీడియో చూపించారు. దీంతో షాకైన పోలీసులు ఆ దంపతులను అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపారు.


By April 14, 2021 at 02:03PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/in-laws-shoot-video-of-daughter-in-law-suicide-incident-in-muzaffarnagar/articleshow/82063682.cms

No comments