Breaking News

అనుమతిలేకుండా భారత ప్రత్యేక ఆర్ధిక జోన్‌లోకి నౌక.. సమర్ధించుకున్న అమెరికా


భారత ప్రాదేశిక జలాల్లోకి అనుమతిలేకుండా అమెరికా నౌక ప్రవేశించడమే కాకుండా.. నావిగేషన్ ఆపరేషన్ నిర్వహిస్తామని ఆ దేశ నౌకదళం చేసిన ప్రకటన చర్చనీయాంశమవుతుంది. లక్షద్వీప్‌లోని భారత ప్రత్యేక ఆర్థిక జోన్‌లో నావిగేషన్ ఆపరేషన్ కోసం అమెరికా నౌక ప్రవేశించింది. అయితే, ఎటువంటి అనుమతి లేకుండా భారత ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించడం మారీటైమ్ భద్రతా విధానానికి విరుద్ధం. కానీ, అమెరికా నౌక మాత్రం అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగానే ప్రవేశించినట్టు సమర్ధించుకుంటోంది. ‘‘ఫ్రీడమ్ ఆఫ్ నావిగేషనల్ ఆపరేషన్‌కు సంబంధించి అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఏప్రిల్ 7, 2021న యుఎస్ఎస్ జాన్ పాల్ జోన్స్ భారత ప్రత్యేక ఆర్థిక మండలిలో లక్షద్వీప్‌కు పశ్చిమాన దాదాపు 130 నాటికల్ మైళ్ల భారత జలాల్లోకి ప్రవేశించింది. ఇందుకు భారత్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు... అంతర్జాతీయ నిబంధనల ప్రకారం ఏదైనా దేశానికి చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్ లేదా కాంటినెంటల్ షెల్ఫ్‌లో సైనిక విన్యాసాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి.. కానీ దానికి విరుద్ధంగా జరిగింది’’ అని అమెరికా సెవెంత్ ఫ్లీట్ పబ్లిక్ అఫైర్స్ ఓ ప్రకటనలో వెల్లడించింది. చైనా విస్తరణ వాదాన్ని ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దుందుడుకు చర్యలను ఇరు దేశాలూ పదే పదే వ్యతిరేకించడం, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలలో అమెరికా ఉండటంతో ఈ ప్రకటన భారత్‌ను గందరగోళంలోకి నెట్టింది. భారత్, అమెరికాలు ఏడాది పొడవునా నౌకదళ విన్యాసాలు నిర్వహిస్తాయి. ‘సాధారణంగా తరుచూ ఫ్రీడమ్ ఆఫ్ నేవిగేషన్ ఆపరేషన్స్ నిర్వహిస్తాం.. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ విన్యాసాలను కొనసాగిస్తాం.. ఈ ఆపరేషన్‌లు ఒక దేశం గురించి, రాజకీయ ప్రకటనలు గురించి కాదు’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా భారత్ నేవీ లేదా విదేశాంగ శాఖ ఇప్పటి వరకూ దీనిపై స్పందించలేదు.


By April 09, 2021 at 01:01PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/us-navy-ship-jhon-paul-holds-ops-near-lakshadweep-without-indian-permission/articleshow/81984122.cms

No comments