Breaking News

తొలి దశ కంటే మరింత ఉద్ధృతంగా కరోనా.. అదొక్కటి మాత్రం శుభపరిణామం


ప్రస్తుతం దేశంలో మహమ్మారి రెండో దశ వ్యాప్తి కొనసాగుతుండగా.. రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. అయితే, ప్రస్తుత జన్యువు అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నా ప్రాణ ముప్పు మాత్రం తక్కువేనని నిపుణులు విశ్లేషిస్తున్నారు. తొలి దశలో పాజిటివ్ కేసులు, మరణాలతో పోల్చి చూస్తే ప్రస్తుతం కోవిడ్ మృతుల సంఖ్య తక్కువగా ఉంది. గతేడాది జనవరిలో మొదలైన కరోనా వైరస్.. సెప్టెంబరు నాటికి గరిష్ఠస్థాయికి చేరింది. తర్వాత క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టి ఈ ఏడాది ఫిబ్రవరికి కనిష్టానికి పడిపోయాయి. అయితే, మహారాష్ట్ర, పంజాబ్ మినహా చాలా రాష్ట్రాల్లో ఫిబ్రవరి తర్వాత పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. బహుశా కోవిడ్ నిబంధనలు సడలించడంతోనే మళ్లీ పెరుగుదల నమోదయ్యింది. ప్రస్తుతం మహారాష్ట్ర, పంజాబ్, గుజరాత్, మధ్యప్రదేశ్, చండీగఢ్‌లో తొలి దశ కంటే రోజువారీ కేసులు భారీగా నిర్ధారణ అవుతున్నాయి. మహారాష్ట్రలో తొలి దశ 2020 మార్చి 9 న ప్రారంభమై డిసెంబరు 22తో ముగియగా.. ఆ సమయంలో రోజువారీ కేసులు కనీస స్థాయికి చేరాయి. మొత్తం 288 రోజుల్లో 19 లక్షల కేసులు నమోదుకాగా.. రోజుకు సగటున 6,606 మంది వైరస్ బారినపడ్డారు. డిసెంబరు 22 నుంచి రెండో దశ విజృంభణ మొదలుకాగా.. మార్చి 31 వరకు ఈ 99 రోజుల్లో 9.1 లక్షల కేసులు బయటపడగా.. రోజువారీ సగటు 9,197గా ఉంది. ఇక, పంజాబ్ విషయానికొస్తే తొలి దశలో రోజువారీ సగటున 532 మంది వైరస్ బారినపడగా.. ప్రస్తుతం అది 1,069గా ఉంది. గుజరాత్‌, మధ్యప్రదేశ్, చండీగఢ్‌లో వరుసగా 888,828,128 ఉండగా.. మొదటి దశలో ఇది 805,780,64గా ఉంది. ఇదే సమయంలో గతంతో పోల్చితే ప్రస్తుత దశలో కోవిడ్ మరణాల రేటు భారీగా తగ్గింది. గతసారి కంటే రెండో దశలో మహారాష్ట్ర 75 శాతం, పంజాబ్ 41 శాతం, గుజరాత్ 83 శాతం, మధ్యప్రదేశశ్ 72 శాతం, చండీగఢ్ 65 శాతం మేర మరణాలు తగ్గడం ఊరటనిచ్చే అంశం. ‘గతంతో పోల్చితే వైరస్ మరింత వేగంగా వ్యాపించేలా ఉత్పరివర్తం (మ్యుటేషన్) చెందినా మరణాల ముప్పు మాత్రం తక్కువగానే ఉంది.. దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాలు మూడో వంతు తగ్గాయి’ అని ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ క్రిటికల్ కేర్ మెడిసిన్ చీఫ్ డాక్టర్ సుమిత్ రే అన్నారు. వైరస్‌లు సాధారణంగా వాటి వ్యాప్తి, మనుగడ కోసం మ్యుటేషన్ చెందుతాయి.. ఇదివరకు ఇన్‌ఫ్లూయోంజా వంటి వైరస్‌లలో ఇలాగే జరిగింది.. వైరస్‌లు మనుగడ పెంచకోవడానికి తమ జాతుల నుంచి బయటకు వెళ్లి, నష్టం కలిగిస్తాయి’ అని పేర్కొన్నారు.


By April 02, 2021 at 08:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-may-be-getting-more-infectious-less-lethal-says-experts/articleshow/81866581.cms

No comments