Breaking News

ఒడిశా స్పీకర్‌కు ఘోర అవమానం.. చెప్పులు విసిరిన బీజేపీ ఎమ్మెల్యేలు


బడ్జెట్ సమావేశాలు శనివారం రణరంగాన్ని తలపించాయి. లోకాయుక్త సవరణ బిల్లుపై చర్చ చేపట్టకుండా ఆమోదించడంపై ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ సూర్యనారాయణ పాత్రోను కోరారు. అందుకు స్పీకర్ నిరాకరించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోడియం వైపు చెప్పులు, కాగితాలు, మైక్రోఫోన్‌లను విసిరికొట్టారు. దాంతో సభను వాయిదావేసిన స్పీకర్.. ముగ్గురు బీజేపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్‌ అమల్లో ఉంటుందని, తక్షణమే వారు సభను వీడి వెళ్లాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలను, షెడ్యూల్‌ కన్నా ఐదు రోజుల ముందే, నిరవధికంగా వాయిదా వేశారు. మధ్యాహ్న భోజన విరామానికి ముందు, ఎలాంటి చర్చ చేపట్టకుండానే లోకాయుక్త సవరణ బిల్లును ఆమోదించడాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. మరోవైపు, రాష్ట్రంలో మైనింగ్‌ వ్యవహారంపై చర్చ జరపాలన్న తమ డిమాండ్‌ను స్పీకర్‌ తోసిపుచ్చడంతో కాంగ్రెస్‌ సభ్యులు కూడా వారికి జతకలిశారు. బీజేపీ సభ్యులు మైక్రోఫోన్‌లను లాగి, తమ ముందున్న కాగితాలను ఉండలుగా చుట్టి స్పీకర్‌ పోడియం వైపు విసిరికొట్టారు. అంతటితో ఆగకుండా చెప్పులు, షూలు కూడా విసిరారు. ప్రతిపక్ష సభ్యుల కారణంగా గందరగోళం నెలకోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్‌ పాత్రో సభను వాయిదా వేశారు. భోజన విరామం అనంతరం సభ ప్రారంభమైన తర్వాత అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ బిష్ణు సేథీ, ఆ పార్టీ విప్‌ మోహన్‌ చరణ్ మాఝీ, మరో ఎమ్మెల్యే జేఎన్‌ మిశ్రాలను సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బిక్రమ్ కేశరి అరుఖా, ప్రభుత్వ చీఫ్ విప్ ప్రమీలా మల్లిక్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత ప్రదీప్ కుమార్‌లు అంతకు ముందు బీజేపీ ఎమ్మెల్యేలు గలాటకు సంబంధించిన వీడియోను పరిశీలించారు. సభ నుంచి బయటకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ఆర్థిక మంత్రి నిరంజన్‌ పూజారి కాగ్‌ నివేదికను సభలో ప్రవేశపెట్టిన అనంతరం, సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ ప్రకటించారు. ఒడిశా అసెంబ్లీలో బీజేపీకి 22 మంది ఎమ్మెల్యేలున్నారు. ‘మా వాళ్లు తప్పేం చేయలేదు. మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంతో అలా చేశారు’ అని బీజేపీ నేత పీకే నాయక్‌ పేర్కొన్నారు. అయితే, తాము ఎటువంటి తప్పు చేయలేదని, అసలు చెప్పులు విసరలేదని బిష్ణు సేథీ అన్నారు. అయితే, ఘటనను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. స్పీకర్‌ను అవమానించడం దురదృష్టకరమని పేర్కొంది.


By April 04, 2021 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mlas-hurling-shoes-and-microphones-at-speaker-in-odisha-assembly/articleshow/81894759.cms

No comments