Breaking News

పాక్ గీత దాటితే సైనిక చర్య ద్వారా భారత్ జవాబు.. అమెరికా సంచలన నివేదిక


భారత్, పాకిస్థాన్ సంబంధాలపై అమెరికా నిఘా విభాగం తన వార్షిక నివేదికలో సంచలన విషయాలు వెల్లడించింది. గతంలో కంటే భారత్ వైఖరిలో మార్పు వచ్చిందని, ప్రధాని మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సైనిక చర్యకు మొగ్గు చూపుతోందని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌ బరితెగించి హింసకు దిగితే భారత్‌ సైనిక చర్య ద్వారానే ఆ దేశానికి బుద్ధి చెబుతుందని కాంగ్రెస్‌కు సమర్పించిన వార్షిక నివేదికలో పేర్కొంది. భారత్, పాక్‌ల మధ్య సాధారణ యుద్ధం అసంభవం అయినప్పటికీ, రెండింటి మధ్య ఉద్దేశపూర్వక సంక్షోభం మరింత తీవ్రతరం అవకాశాన్ని కొట్టిపారేయలేమని, ఇది ప్రమాదకరమని వ్యాఖ్యానించింది. ‘‘గతంలో కంటే భారత్‌ వైఖరిలో మార్పు వచ్చింది.. నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం చర్చలు, దౌత్యమార్గాల కంటే సైనిక చర్యకే మొగ్గు చూపే అవకాశం ఉంది. కశ్మీర్లో అశాంతి వల్ల గానీ, ఏదేనా ఉగ్రదాడి వల్ల గానీ రెండు అణ్వాయుధ దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగి ఘర్షణకు దారితీసే అవకాశం ఉంది’’ అని ఆ నివేదిక వివరించింది. కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను 2019 ఆగస్టులో రద్దుచేసిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయని పేర్కొంది. ఉగ్రవాదం, చొరబాట్లు, హింసలేని వాతావరణంలో పాకిస్థాన్‌తో సాధారణ పొరుగు దేశంలా సంబంధాలు కోరుకుంటున్నామని, అటువంటి వాతావరణాన్ని సృష్టించే బాధ్యత దాయాదిపై ఉందని భారత్ చెబుతోంది. అఫ్గనిస్థాన్, ఇరాక్, సిరియాలో పోరాటం అమెరికా సేనలపై ప్రభావం చూపితే, అణ్వాయుధ దేశాలపై భారత్, పాక్‌ల మధ్య ఘర్షణలు మొత్తం ప్రపంచం ఆందోళన వ్యక్తం చేస్తోందని నివేదిక తెలిపింది. ఇజ్రాయేల్, ఇరాన్ మధ్య పునరావృత హింస, లిబియాలో విదేశీ శక్తుల కార్యకలాపాలు, ఆఫ్రికా, ఆసియా, మధ్యప్రాచ్యంతో సహా ఇతర ప్రాంతాలలో విభేదాలు పెరగడం లేదా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గన్‌లో శాంతి చర్చల ప్రక్రియ వచ్చే ఏడాది కూడా ముందుకు సాగకపోవచ్చని అభిప్రాయపడింది. ‘‘పోరాటంలో తాలిబన్లు ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తాయి.. ఒకవేళ సంకీర్ణ దళాలను పూర్తిగా ఉపసంహరిస్తే అఫ్గన్ ప్రభుత్వం ఇబ్బందులను ఎదుర్కొంటుంది.. యుద్ధంలో అఫ్గనిస్థాన్ ప్రభుత్వం ఎదురుదెబ్బలను తింటూనే ఉంది.. తాలిబన్లు మాత్రం సైనిక పోరాటంలో విజయంపై ఆత్మవిశ్వాసంతో ఉన్నారని తెలిపింది. ‘‘ఆఫ్ఘన్ దళాలు ప్రధాన నగరాలు, ఇతర ప్రభుత్వ బలమైన ప్రాంతాలను రక్షిస్తూనే ఉన్నాయి.. కానీ, అవి భద్రతా కార్యకలాపాలతో ముడిపడి ఉన్నాయి.. స్వాధీనం చేసుకున్న భూభాగంపై పట్టు సాధించడం లేదా గతేడాది కోల్పోయిన ప్రాంతాలలో ఉనికిని పునఃస్థాపించడానికి చాలా కష్టపడాలి’’అని నివేదిక తెలిపింది.


By April 15, 2021 at 07:24AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-more-likely-to-respond-with-military-force-to-pakistan-provocations-us-intelligence-report/articleshow/82076523.cms

No comments