Breaking News

ఇరాన్ అణు ప్లాంట్‌పై ఇజ్రాయేల్ సైబర్ దాడి.. కుప్పకూలిన విద్యుత్ వ్యవస్థ!


ఇరాన్ అణు కర్మాగారాన్ని అధ్యక్షుడు ప్రారంభించిన కొద్దిసేపటికే అక్కడ విద్యుత్ సరఫరా వ్యవస్థ అనూహ్యంగా కుప్పకూలింది. దక్షిణ టెహ్రాన్‌లోని నంతాజ్ కాంప్లెక్స్ వద్ద యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు నిర్మించిన అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ఆదివారం ప్రారంభించారు. కర్మాగారంలో ఉత్పత్తి ప్రారంభమైన కొద్ది గంటల్లోనే విద్యుత్ సరఫరా వ్యవస్థ నిలిచిపోయింది. నతాంజ్‌ ప్లాంట్‌లో అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజులు ఉండగా.. విద్యుత్ వ్యవస్థలో సమస్య తలెత్తడంతో వర్క్‌షాప్ సహా అణుశుద్ధి కర్మాగారం అంతటా సరఫరా నిలిచిపోయిందని ఇరాన్‌ అణు విభాగం అధికార ప్రతినిధి బెహ్రౌజ్‌ కమల్‌ వాండి తెలిపారు. దీనికి కారణాలు తెలియరాలేదని, ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని పేర్కొన్నారు. కాలుష్య సమస్య కూడా ఉత్పన్నం కాలేదని తెలిపారు. అయితే ఈ ఘటనపై పార్లమెంటులోని ఇంధన కమిటీ అధికార ప్రతినిధి మాలెక్‌ షిరియాతి నియాసర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఇది విద్రోహచర్య, చొరబాటును సూచిస్తోందని.. ‘అణు ఉగ్రవాదం’ అని ఇరాన్‌ అటామిక్ ఎనర్జీ చీఫ్ అలీ అక్బర్‌ సలేహి ఆరోపించారు. అయితే నిర్దిష్టంగా ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ‘‘తీవ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకోవడానికి మా అణు పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునే చర్యలు కొనసాగిస్తాం.. అలాగే నిరంకుశ ఆంక్షలను ఎత్తివేయించేలా కృషి చేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అణు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (ఐఏఈఏ) చర్యలు చేపట్టాలన్నారు. ఈ ఘటనకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునే హక్కు తమకుందని అన్నారు. ఈ ఘటన వెనుక తమ ప్రమేయం ఉండొచ్చని ఇజ్రాయెల్‌ అధికారిక మీడియా ‘కాన్‌’పేర్కొవడం గమనార్హం. దాదాపు దశాబ్దం కిందట నతాంజ్‌పై జరిగిన ‘స్టక్స్‌నెట్‌’ సైబర్‌ దాడిని కూడా తమ దేశమే నిర్వహించిందని తెలిపింది. తాజా ఘటన వెనుక ఇజ్రాయెల్‌ హస్తమున్నట్లు తేలితే రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్‌ అణు కార్యక్రమాల నియంత్రణకు కుదిరిన ఒక ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకూ ఇది విఘాతంగా మారొచ్చు. నతాంజ్‌ ప్లాంట్‌లో విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలిపోయే సమయానికి అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలపై అక్కడి ప్రభుత్వంతో ఆయన చర్చించే వీలుంది. ఈ ఘటన గురించి తమకు సమాచారం అందిందన్న ఐఏఈఏ.. స్పందించడానికి నిరాకరించింది. నంతాజ్ ప్లాంట్‌కు ఆది నుంచి అవాంతరాలే ఎదురవుతున్నాయి. గతేడాది జులైలో ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించి సెంట్రిఫ్యూజ్ వర్క్‌షాప్ పూర్తిగా ధ్వంసమయ్యింది. ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేస్తున్నట్టు అగ్రరాజ్యం అమెరికా అనుమానిస్తోంది. అణు కార్యక్రమాలను నియంత్రించడానికి 2015లో ఇరాన్ సహా ఆరు దేశాల మధ్య 2015లో ఒప్పందం కుదిరింది. కానీ, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చి, ఇరాన్‌పై ఆంక్షలు విధించారు. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఒప్పందంవైపు మొగ్గుచూపుతున్నా.. ఆ దిశగా అడుగులు పడలేదు.


By April 12, 2021 at 07:48AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/israel-carried-out-cyber-attack-on-iran-nuclear-plant-natanz-restrat-after-hours/articleshow/82023871.cms

No comments