Breaking News

నకిలీ పోలీస్ ఐడీతో చొరబడి ఫెడెక్స్ మాజీ ఉద్యోగి కాల్పులు.. 8 మంది మృతి


అమెరికాలో గన్ కల్చర్ పడగవిప్పి బుసలు కొడుతోంది. తరుచూ కాల్పులు ఘటనలతో పలువురు ప్రాణాలు కోల్పోగుతున్నారు. కోవిడ్ సమయంలో వరుస కాల్పుల ఘటనలు అగ్రరాజ్యాన్ని మరింత వణికిస్తున్నాయి. గురువారం రాత్రి ఇండియానాపోలిస్‌లోని ఫెడెక్స్‌ ఫెసిలిటీ ఆఫీసు వద్ద గుర్తు తెలియని ఓ వ్యక్తి విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. తర్వాత దుండగుడు తనను తానూ కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీస్ ఐడీతో దుండగుడు ఆ ప్రాంతంలోకి చొరబడ్డాడు. క్షతగాత్రుల్లో భారత సంతతికి చెందిన ఓ యువతి కూడా ఉంది. కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఫెడెక్స్‌లో మాజీ ఉద్యోగి బ్రెండన్ హోలే (19)గా గుర్తించారు. ఫెడెక్స్‌ కేంద్రంలో దాదాపు 4,500కు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఆటోమేటిక్‌ మెషిన్‌ గన్‌తో సాయుధుడు కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇండియానాపోలీస్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌కు సమీపంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఫెడెక్స్ ఉద్యోగుల కుటుంబాలు, బంధువులు స్థానిక హాలీడే ఇన్ వద్ద కలిసి సమయంలో కాల్పులు జరిగాయి. బ్రెండన్‌ను ఫెడెక్స్‌ గతేడాది ఉద్యోగం నుంచి తొలగించింది. అప్పటి నుంచి బ్రెండన్ మానసికంగా కుంగుబాటుకు గురయ్యాడని, గతేడాది మార్చిలో ఆత్మహత్యాయత్నం చేశాడని అతడి తల్లి తెలిపింది. ఈ సమయంలో అతడిని ఇండియానాపోలీస్ పోలీస్ అధికారులు మానసిక వైద్యశాలలో చేర్పించి తాత్కాలికంగా చికిత్స అందజేశారు. ఏప్రిల్‌లో అతడిని ఎఫ్‌బీఐ విచారించి, హోలే బెడ్‌ రూమ్‌లో అనుమానిత వస్తువులను గుర్తించారు. అతడి నివాసంలో షాట్ గన్ స్వాధీనం చేసుకున్నారు. శాన్‌ ఆంటోనియా విమానాశ్రయం దగ్గర జరిగిన సంఘటనలో ఓ సాయుధుడిని పోలీసులు కాల్చి చంపారు. విమానాశ్రయం బి టెర్మినల్‌ దగ్గర ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎదురుగా వస్తున్న వాహనాలపై కాల్పులు జరుపుతూ వచ్చిన సాయుధుడిని టెర్మినల్‌ బి దగ్గర ఓ పోలీసు అధికారి అడ్డగించారు. వెంటనే అతడు తన కారు దిగి కాల్పులు ప్రారంభించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసు అధికారి జరిపిన కాల్పుల్లో ఆగంతకుడు హతమయ్యాడు. మార్చి 22న కొలొరాడోలో సూపర్ మార్కెట్ వద్ద ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత అట్లాంటాలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడగా.. ఎనిమిది మంది చనిపోయారు. అమెరికాలో దుండగులు జరుపుతున్న కాల్పులకు ఏటా 40,000 మంది బలవుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడుతున్నవారి కంటే ఇది చాలా అధికం. కాగా, తుపాకుల సంస్కృతికి కళ్లెం వేసే దిశగా అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన ఆరు కీలక చర్యలను ప్రతిపాదించారు. మద్యం, పొగాకు, ఆయుధాలు, పేలుడు పదార్థాల నిరోధక సంస్థ(ఏటీఎఫ్‌) డైరెక్టర్‌గా డేవిడ్‌ చిప్‌మాన్‌ను నియమించారు. మాజీ ఫెడరల్‌ ఏజెంట్‌ అయిన డేవిడ్‌ ప్రస్తుతం తుపాకుల నియంత్రణ సంస్థ గిఫార్డ్స్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. ఏటీఎఫ్‌ ఏజెంట్‌గా ఆయన 25 ఏళ్లు పనిచేశారు. అయితే, అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రతిపాదనను రిపబ్లికన్‌లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపిస్తున్నారు.


By April 17, 2021 at 07:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/police-id-gunman-who-killed-8-people-at-an-indianapolis-fedex-facility/articleshow/82111564.cms

No comments