Breaking News

చత్తీస్‌గఢ్: ఆ జిల్లాలో ఏప్రిల్ 6 నుంచి సంపూర్ణ లాక్‌డౌన్


దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్ర, కర్ణాటక, చత్తీస్‌గఢ్‌ సహా మొత్తం 11 రాష్ట్రాల్లో రోజువారీ కేసుల వృద్ధిరేటు అసాధారణంగా ఉంది. గడచిన రెండు వారాలుగా పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో 6.8% మేర కేసుల వృద్ధి నమోదుకాగా... గత జూన్‌లో నమోదైన రికార్డు వృద్ధి 5.5%కంటే ఇది అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రోజువారీ మరణాల్లో 5.5% పెరుగుదల నమోదయ్యింది. గతేడాది సెప్టెంబరులో ఒక్కరోజులో గరిష్ఠంగా 97 వేల కేసులు రాగా.. ఇప్పుడు ఆ సంఖ్య 89 వేలకు చేరింది. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పలు రాష్ట్రాలు కఠిన ఆంక్షలు దిశగా ముందుకు సాగుతున్నాయి. చత్తీస్‌గఢ్‌లో కోవిడ్ కేసులు రికార్డుస్థాయిలో నమోదుకావడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. దుర్గ్ జిల్లాలో పరిస్థితి అదుపుతప్పుతుండటంతో అక్కడ 9 రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్ విధించింది. ఏప్రిల్ 6 నుంచి 9 వరకు లాక్‌డౌన్ అమల్లో ఉంటుందని దుర్గ్ జిల్లా కలెక్టర్ సర్వేశ్వర్ భూరే వెల్లడించారు. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇక, చత్తీస్‌గఢ్‌లో శుక్రవారం 4,174 కేసులు బయటపడగా.. 43 మంది ప్రాణాలు కోల్పోయారు. రాయ్‌పూర్, దుర్గ్ జిల్లాల్లో రికార్డుస్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో దుర్గ్‌లో 964, రాయ్‌పూర్‌లో 1,405 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రెండు జిల్లాల్లో వరుసగా మొత్తం కేసులు 41,032, 68,404కి చేరాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని, అవసరమైతే లాక్‌డౌన్ విధించే సంపూర్ణ అధికారాలను జిల్లా కలెక్టర్లకు ఇస్తున్నట్టు చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ వెల్లడించారు.


By April 03, 2021 at 07:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/complete-lockdown-in-chhattisgarh-durg-district-amid-covid-surge/articleshow/81881058.cms

No comments