Breaking News

నిన్న ఒక్కరోజే దాదాపు 48 వేల కేసులు.. లాక్‌డౌన్‌పై మహా సీఎం కీలక ప్రకటన


మహారాష్ట్రలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం అక్కడ దాదాపు 48 వేల మందికి కొత్తగా వైరస్ నిర్దారణ అయ్యింది. మరణాలు కూడా భారీగా చోటుచేసుకుంటున్నాయి. గడచిన 24 గంటల్లో 481 మంది కోవిడ్-19కు బలయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే లాక్‌డౌన్‌ విధించడాన్ని తోసిపుచ్చలేమని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే పునరుద్ఘాటించారు. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదుకావడంతో సీఎం శుక్రవారం రాత్రి ఈ ప్రకటన చేశారు. త్వరలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించనున్నట్టు ప్రకటించిన ఉద్ధవ్.. కోవిడ్‌ ఛైన్‌ను ఛేదించడంపై పరిష్కారాల కోసం అన్వేషిస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు, తానూ లాక్‌డౌన్‌‌ను కోరుకోవడంలేదని, కానీ పరిష్కారమేంటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65 లక్షల వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్టు సీఎం పేర్కొన్నారు. గురువారం ఒక్కరోజే 3 లక్షల మందికి వ్యాక్సినేషన్ అందజేసినట్టు వివరించారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కూడా మాస్క్‌ వేసుకోకపోవడంతో కొందరు కోవిడ్ బారిన పడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో రోజుకు 2.5 లక్షల నిర్ధారణ పరీక్షలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 70 శాతం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు ఉంటాయన్నారు. కరోనాతో పరిస్థితులు క్షీణిస్తే వచ్చే 15-20 రోజుల్లో వైద్య సదుపాయాల కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇప్పటికే హెచ్చరించానని తెలిపారు. వైరస్‌ తీవ్రతను బట్టి రెండు రోజుల్లో లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గతేడాది కంటే మరింత దిగజారిందని అన్నారు. అప్పట్లో కేసులు తగ్గిన తరువాత సంతృప్తి చెందామని పేర్కొన్నారు. ‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది... ఇలాగే కొనసాగితే ప్రస్తుత వైద్య సౌకర్యాలు సరిపోవు.. మరిన్ని సదుపాయాలను పెంచాల్సి ఉంది.. కానీ, ఒకవేళ పడకలను పెంచినా, వైద్యులు, నర్సులను ఎలా పెంచగలం’ అని వ్యాఖ్యానించారు. ప్రమాణాల విషయంలో ఎటువంటి రాజీ ఉండబోదు.. కోవిడ్ డేటాను దాచిపెట్టడంలేదు.. కేసుల విషయంలో తప్పుడు లెక్కలు చెప్పడం లేదు అన్నారు. మరోవైపు, మహారాష్ట్రలో ఇప్పటికే కరోనా కట్టడికి పలు జిల్లాలు, నగరాల్లో రాత్రిపూట కర్ఫ్యూ వంటి ఆంక్షలు అమలవుతున్నాయి. పుణే నగరంలో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు 12 గంటల కర్ఫ్యూ విధించారు. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 47,913 కొత్త కేసులు, 481 మరణాలు నమోదైనట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. వీటిలో ఒక్క ముంబయి మహా నగరంలోనే 8,648 కేసులు, 20 మరణాలు వెలుగుచూశాయి.


By April 03, 2021 at 08:05AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/possibility-of-lockdown-cannot-be-ruled-out-covid-19-situation-prevails-says-maharashtra-cm/articleshow/81881244.cms

No comments