Breaking News

అలీబాబాకు చైనా ఝలక్.. 2.78 బిలియన్ డాలర్ల భారీ జరిమానా!


ఈ-కామర్స్ దిగ్గజం అలిబాబాకు చైనా ఊహించని ఝలక్ ఇచ్చింది. మార్కెట్ గుత్తాధిపత్యం నిబంధనలను ఉల్లంఘించారనే కారణాలతో 18.2 బిలియన్ యువాన్ల (2.78 బిలియన్ డాలర్లు) భారీ జరిమానా విధించింది. గుత్తాధిపత్యం నిబంధనల దుర్వినియోగానికి పాల్పడినట్టు చైనా అధికారిక మీడియా జున్హూ శనివారం వెల్లడించింది. ఈ వ్యవహారంపై డిసెంబరులో దర్యాప్తు ప్రారంభించి, జరిమానాపై ఓ నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొంది. దర్యాప్తు, జరిమానా కేంద్రీకృతమై ఉంది.. తన ప్లాట్‌ఫామ్‌లలో వస్తువులను విక్రయించాలనుకునే వ్యాపారులను ప్రత్యర్థి ఇ-కామర్స్ సైట్‌ల నుంచి అలీబాబా తప్పించింది. అలీబాబా సంస్థ 2019లో 455.7 బిలియన్ యువాన్ల మేర లావాదేవీలు జరగ్గా.. దానిపై నాలుగు శాతం జరిమానా విధించాలని నిర్ణయించినట్టు జిన్హువా పేర్కొంది. చైనాలో తమ వ్యాపార కార్యకలాపాల పెరుగుదల విషయంలో అలీబాబా, ఇతర ప్రముఖ టెక్ సంస్థలు ఆందోళనకు గురవుతున్నాయి. ఇక్కడ సాంకేతికతపై అవగాహన ఉన్న వినియోగదారులు షాపింగ్‌, ప్రయాణాలు, బ్యాంకు రుణాలు తీసుకోవడం, చెల్లింపులు, ఇతర రోజువారీ పనుల కోసం ప్రముఖ ఈ-కామర్స్ వేదికలను ఉపయోగిస్తున్నారు. గతేడాది అక్టోబరులో చైనా మార్కెట్ విధానాలపై అలీ బాబా సహ-వ్యవస్థాపకుడు జాక్ మా విమర్శలు గుప్పించిన తర్వాత ఆ సంస్థపై డ్రాగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. చైనా ప్రభుత్వానికి జాక్ మా సలహాలు ఇవ్వబోయి వారి ఆగ్రహానికి గురయ్యారు. గతేడాది అక్టోబరు 24న చైనాలో జరిగిన ఓ కార్యక్రమంలో జాక్‌ మా ప్రసంగిస్తూ చైనా ఆర్థిక వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపారు. చైనా బ్యాంకులు తాకట్టు దుకాణాల మనస్తత్వాన్ని వీడి విస్తృతంగా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. చైనా ఆర్థిక, నియంత్రణ వ్యవస్థ ఆవిష్కరణలను అరికట్టాయని ఆరోపించిన జాక్ మా.. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా మరిన్ని చిన్న సంస్థలు, వ్యక్తులకు ఆర్థిక సేవల విస్తరణను పునరుద్ధరించాలని పిలుపునిచ్చారు. రెండు నెలలుగా ఆయన బాహ్య ప్రపంచానికి దూరంగా ఉండటంతో అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. చైనా ప్రభుత్వానికి సలహాలివ్వబోయి ఆయన కోరి కష్టాలను కొనితెచ్చుకున్నారు.


By April 10, 2021 at 10:56AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/china-hits-alibaba-with-huge-2-78-billion-fine-for-market-abuse/articleshow/82000579.cms

No comments