Breaking News

ఫ్రీ వ్యాక్సినేషన్‌కు సిద్ధమైన 17 రాష్ట్రాలు.. టీకాలపై ఆంక్షల ఎత్తివేతకు కారణం ఇదే


కొత్త వ్యాక్సిన్ విధానంపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్దన్ వివరణ ఇచ్చారు. దేశంలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ ఉచితంగా కొవిడ్‌ టీకా ఆందజేయడానికి ఇప్పటికే 17 రాష్ట్రాలు సంసిద్ధత వ్యక్తం చేశాయని, అందువల్ల ప్రజలపై అదనపు భారం పడే అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు కోరడంతోనే వ్యాక్సిన్‌పై ఇంతవరకూ ఉన్న ఆంక్షలను ఎత్తివేశామని పేర్కొన్నారు. ‘‘వ్యాక్సినేషన్‌పై ఆంక్షలను తొలగించాలని రాష్ట్రాలు డిమాండ్‌ చేస్తూ వచ్చాయి. అందుకే కొత్త విధానాన్ని ప్రకటించాం. దీనివల్ల రాష్ట్రాలు నేరుగా తయారీదారుల నుంచి టీకాలు కొనుగోలు చేసే స్వేచ్ఛ లభిస్తుంది.. అంతేకాదు వ్యాక్సిన్‌ సరఫరాలో జాప్యం తగ్గుతుంది.. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, మహారాష్ట్ర, ఝార్ఖండ్‌, జమ్మూకశ్మీర్‌, తమిళనాడు, హిమాచల్‌ప్రదేశ్‌, కేరళ, ఛత్తీస్‌గఢ్‌, హరియాణా, సిక్కిం, పశ్చిమబెంగాల్‌, అస్సాం రాష్ట్రాలు తమ పరిధిలో 18-45 ఏళ్లవారికి ఉచితంగానే వ్యాక్సిన్‌ అందిస్తామని ప్రకటించాయి. కేంద్రం సేకరించే 50% వ్యాక్సిన్లను కూడానేరుగా రాష్ట్రాలకే అందిస్తుంది. అందువల్ల కేంద్రానికి తక్కువ ధరకు టీకాలు దొరుకుతున్నాయని, రాష్ట్రాలకు దక్కడం లేదన్న ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మార్గం ద్వారా కచ్చితంగా ఉచితంగానే వ్యాక్సిన్‌ దక్కుతోంది.. మూడో దశ వ్యాక్సినేషన్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’’ అని హర్షవర్ధన్‌ పేర్కొన్నారు. ‘‘ ప్రక్రియపై అనవసరమైన రాజకీయాలకు కొంత మంది నేతలు ప్రయత్నించడం విచారకం... అది టీకా సమర్థత గురించి లేదా ధరల గురించి అయినా ప్రతి దశలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు.. కార్పొరేట్, ప్రైవేట్ రంగానికి వనరులను సమకూర్చడానికి మిగతా 50 శాతం కోటా ఉపకరిస్తుంది.. తద్వారా భారత్‌లో ప్రతివారికి సాధ్యమైనంత త్వరగా టీకాలు అందజేయవచ్చు’’ అని హర్ష్‌వర్దన్ తెలిపారు. సీరమ్ సంస్థ కోవిషీల్డ్‌ను కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400, ప్రయివేట్ హాస్పిటల్స్‌కు రూ.600కి అందజేయనున్నట్టు ప్రకటించింది. ఇటు భారత్ బయోటెక్ సైతం ధరలను నిర్ణయించింది. కొవాగ్జిన్ ఒక్కో డోస్ కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.600, ప్రయివేట్ హాస్పిటల్స్‌కు రూ.1200గా పేర్కొంది. ఈ వ్యత్యాసాలపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి.


By April 26, 2021 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/needless-politics-centre-not-getting-vaccines-cheap-says-health-minister-harsh-vardhan/articleshow/82252663.cms

No comments