కుప్పకూలిన MiG-21 యుద్ధవిమానం.. పైలట్ మృతి

ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన యుద్ధ విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ దుర్మరణం పాలయ్యారు. యుద్ధ విన్యాసాల శిక్షణ జరుగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారత వాయుసేనకు చెందిన సీనియర్ అధికారి, గ్రూప్ కెప్టెన్ ఎ గుప్తా మృతి చెందారు. గ్వాలియర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ సమీపంలో బుధవారం (మార్చి 17) ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ విషయాన్ని IAF అధికారికంగా ప్రకటించింది. వాయుసేనకు చెందిన మిగ్-21 బైసన్ విమానం క్రాష్ అయినట్లు తెలిపింది. గత ఏడాదిన్నర కాలంలో మిగ్-21 శ్రేణి విమానాలు ప్రమాదానికి గురికావడం ఇది మూడోసారి కావడం గమనార్హం. 2019 సెప్టెంబర్లో గ్వాలియర్ ఎయిర్ బేస్లోనే మిగ్-21 ప్రమాదానికి గురైంది. రెండు నెలల కిందట రాజస్థాన్లోని సూరత్గర్లో మరో మిగ్-21 ఫైటర్ జెట్ కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి పైలట్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. 2016 నుంచి భారతీయ వాయుసేన మొత్తం 27 విమానాలను కోల్పోయినట్లు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ 2019లో పార్లమెంట్లో తెలిపారు. వీటిలో 15 యుద్ధ విమానాలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ప్రమాదాల్లో భారత్ ఖరీదైన విమానాలను నష్టపోతోంది. అత్యంత విలువైన ఫైటర్ పైలట్లను కూడా కోల్పోతోంది. తాజా ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని ఐఏఎఫ్ తెలిపింది. ఘటనపై కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ప్రారంభించినట్లు వెల్లడించింది. Must Read: ✧ ✧
By March 17, 2021 at 02:47PM
No comments