Breaking News

కర్ణాటక: రాసలీలల సీడీ కేసులో మరో ట్విస్ట్.. వారి ఖాతాలకు భారీగా నగదు జమ


కర్ణాటక మాజీ మంత్రి రమేశ్ జార్ఖిహోళి రాసలీలల సీడీ వ్యవహారంపై ఏర్పాటుచేసిన సిట్ విచారణలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. యువతితో రమేష్‌ జార్కిహొళి ఏకాంతంగా ఉన్నప్పుడు సీడీ రూపొందించినందుకు కొందరికి భారీగా ముడుపులు అందినట్లు సిట్‌ గుర్తించింది. ఈ కేసులో అనుమానిత వ్యక్తుల ఖాతాల్లోకి లక్షలాది రూపాయల నగదు బదిలీ అయినట్లు సిట్‌ అధికారి ఒకరు వెల్లడించారు. సీడీ వ్యవహారంలో ఎనిమిది మంది ఉన్నట్టు గుర్తించిన సిట్‌ అధికారులు వీరి బ్యాంకు ఖాతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానితుల ఖాతాల్లోకి నెల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు జమ కావడంతో దీని వెనుక కుట్ర దాగి ఉందని భావిస్తున్నారు. కీలక నిందితుడు అరుణ్‌, అతడి ఖాతాలోకి భారీగా నగదు జమైనట్టు తేలింది. అరుణ్ సోదరుడి ఖాతాలో నెల రోజుల వ్యవధిలో రూ.40 లక్షలు జమ అయినట్లు అధికారులు గుర్తించారు. మరో నిందితుడు కూడా రెండు రోజుల కిందట బ్యాంకుకు వెళ్లి రూ.5 లక్షల డిపాజిట్ చేశాడు. ఇంకొక నిందితుడి ఖాతాలో రూ.26 లక్షలు జమైనట్టు గుర్తించామని సిట్ అధికారులు తెలిపారు. అటు, సీడీలోని యువతి నివాసంలోనూ సిట్ సోదాలు నిర్వహించింది. ఏసీపీ హెచ్ఎన్ ధర్మేంద్ర నేతృత్వంలోని సిట్ బృందం సోదాలు జరిపింది. బుధవారం రాత్రి జరిపిన సోదాల్లో విలువై వస్తువులు, గాడ్జెట్స్, సిమ్ కార్డ్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు, యువతి తండ్రి తన కుమార్తెను బెంగళూరులో కిడ్నాప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యువతి నివాసం ఉన్న ఇంటిలో సోదాలకు కోర్టు నుంచి సెర్చ్ వారెంట్ తీసుకున్న సిట్.. ఆ ఇంటి యజమాని స్టేట్‌మెంట్ సైతం రికార్డు చేసింది. సీడీ వ్యవహారంతో సంబంధమున్న అనుమానితులు ప్రాంతీయ న్యూస్ ఛానెల్స్‌లో పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉండగా, యువతి ఎక్కడున్నదీ ఇంకా తెలియరాలేదు. ఆమె ప్రతి రెండు మూడు గంటలకు మకాం మార్చేస్తున్నట్టు సిట్ భావిస్తోంది.


By March 19, 2021 at 07:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jarkiholi-cd-case-sit-identifies-huge-money-transfers-to-suspects-bank-accounts/articleshow/81580415.cms

No comments