భారీ దాడులకు ఐఎస్ స్కెచ్: ఐదుగురు అరెస్ట్, ఎన్ఐఏ సోదాల్లో షాకింగ్ నిజాలు!

దేశవ్యాప్తంగా నాలుగు నగరాల్లోని పది ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నిర్వహించిన సోదాల్లో ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు పట్టుబడ్డారు. వీరికి ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాన్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్టు గుర్తించారు. ఢిల్లీ, కర్ణాటక, కేరళలో సోమవారం ఉదయం ఈ సోదాలు నిర్వహించింది. రెండు రోజుల కిందట కొత్తగా నమోదుచేసిన కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టింది. నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని వారి ఇచ్చిన సమాచారం ఆధారంగా దాడులు చేసినట్టు తెలిపింది. ఐఎస్ ఉగ్రవాదులతో ఏడుగురు వ్యక్తులకు గత కొంతకాలంగా సంబంధాలున్నాయని నిఘా వర్గాల పరిశీలనలో వెల్లడయ్యింది. సోషల్ మీడియా ద్వారా ముస్లిం యువతను పాకిస్థాన్ ఆకర్షించి రిక్రూట్ చేసుకుని, ఆన్లైన్లో శిక్షణ ఇచ్చి స్థానికంగా దాడులకు వ్యూహరచన చేస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో బయటపడింది. ఐఎస్ ఉగ్రవాదులకు పాకిస్థాన్ సహకారం అందిస్తూ దాడులకు వ్యూహరచన చేసిందని తేలింది. దీంతో ఐఎస్ ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఎన్ఐఏ రంగంలోకి దిగి ఆకస్మిక దాడులు చేసింది. పట్టుబడినవారిలో నలుగురు మహిళలు ఉండగా.. వారిని త్వరలో కోర్టు ముందు హాజరుపరుస్తామని తెలిపింది. చదువుకున్న యువతను ఐఎస్ ఆకర్షించి, వీరి సాయంతో పలుచోట్ల దాడులకు కుట్రపన్నినట్టు గుర్తించామని ఎన్ఐఏ పేర్కొంది. ఢిల్లీలోని జఫ్రాబాద్లోనూ, బెంగళూరు నగరంలోని రెండు ప్రాంతాలు, కేరళలోని కొచ్చి, కన్నూర్లోని నాలుగు ప్రదేశాల్లో ఈ సోదాలు నిర్వహించినట్టు ఎన్ఐఏ తెలిపింది. దక్షిణాది రాష్ట్రాల్లోనూ ఐఎస్తో సంబంధాలున్నట్టు ఇటీవల పలు సోదాల్లో బయటపడింది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడులలో ఐఎస్ సానుభూతిపరులు.. అనేక మార్లు సమావేశాలు కూడా ఏర్పాటు చేసుకున్నట్టు గుర్తించారు.
By March 15, 2021 at 12:12PM
No comments