ఈ ఏడాది చివరికి కరోనా అంతంపై ఊహించుకోవడం అవివేకమే: డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ఈ ఏడాది చివరి నాటికి మహమ్మారి అంతమవుతుందని ఆలోచించడం అవివేకమేనని, అది అవాస్తవమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పష్టం చేసింది. కానీ, ఇటీవల అందుబాటులోకి వచ్చిన ప్రభావంతమైన టీకాలు ఆస్పత్రుల్లో చేరే రోగులు, మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించగలవని విశ్వాసం వ్యక్తం చేసింది. అయితే, ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తిని వీలైనంత మేరకు కట్టడిచేయడానికి ప్రపంచం దృష్టిసారించాలని సూచించింది. ఈ మేరకు ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ చీఫ్ డాక్టర్ సోమవారం జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. మనం అప్రమత్తంగా ఉంటే మహమ్మారికి సంబంధించిన విషాదం, ఆసుపత్రిలో చేరడం, మరణాలను ఈ ఏడాది చివరినాటికి తగ్గించగలమని ర్యాన్ అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ఆమోదం పొందిన టీకాలు చాలా సహాయపడుతున్నాయని వెల్లడవుతున్న నివేదికలపై డబ్ల్యూహెచ్ఓ భరోసా ఇచ్చిందని అన్నారు. ‘వ్యాక్సిన్లు మరణాలు, ఆసుపత్రిలో చేరినవారిపై మాత్రమే కాకుండా వ్యాప్తి తీవ్రత, ముప్పు విషయంలో గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తే ఈ మహమ్మారిని నియంత్రించే దిశలో మనం వేగంగా వెళ్తున్నామని నేను నమ్ముతాను’ అని పేర్కొన్నారు. కానీ, ఇది వైరస్ వ్యాప్తి విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదని హెచ్చరించారు. ప్రస్తుతం వైరస్ చాలా నియంత్రణలో ఉందని చెప్పారు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా ధనిక దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రారంభమై మూడు నెలల గడిచిన తర్వాత.. పేద దేశాలకు టీకా చేరడం విచారకరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అంతేకాదు, గతవారం కరోనా వైరస్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. గడిచిన ఏడు వారాల్లో తొలిసారిగా గత వారం కేసుల్లో పెరుగుదల కనిపించినట్లు పేర్కొంది. కరోనా కేసుల పెరుగుదల ఆందోళనకు గురిచేసే అంశమని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ హెచ్చరించారు. కొవిడ్ నిబంధనలను కుదించడమే ఇందుకు కారణమని అన్నారు. ఓవైపు వైరస్ వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతున్నప్పటికీ.. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని టెడ్రోస్ చెప్పారు. కొవిడ్ టీకాలను పేద దేశాలకు ఇవ్వకుండా స్వప్రయోజనాలకు వాడుకొంటున్న ధనిక దేశాల తీరును ఆయన తప్పుబట్టారు. ప్రపంచవ్యాప్తంగా ముప్పు పొంచి ఉన్న వారిని కాపాడటం అందరి బాధ్యతగా పేర్కొన్నారు.
By March 02, 2021 at 02:18PM
No comments