Breaking News

భారత్, చైనా స్నేహితులు.. ప్రత్యర్థులు కాదు: డ్రాగన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు


తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల నుంచి సైన్యాలను ఉపసంహరించిన తర్వాత మిగతా ప్రాంతాల్లో త్వరగా వెనక్కు మళ్లించాలని భారత్ కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు అంశం కేవలం ద్వైపాక్షిక సంబంధాలకు మాత్రమే పరిమితం కాదని, వివాదాన్ని పరిష్కరించి, ముందుకు సాగడానికి ఇరు దేశాలూ సానుకూల పరిస్థితులను సృష్టించాలని వ్యాఖ్యానించారు. ఆదివారం జరిగిన వార్షిక మీడియా సమావేశంలో వాంగ్ యీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. భారత్-చైనాలు భాగస్వాములు.. ప్రత్యర్థులు కాదని పేర్కొన్నారు. గతేడాది సరిహద్దుల్లో వివాదానికి భారత్ కారణమని మరోసారి ఆరోపించారు. వివాదాలకు సరైన విధానంలో పరిష్కారించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌తో సంబంధాలపై అడిగిన ప్రశ్నకు వాంగ్ సమాధానం ఇస్తూ.. సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఘటనల్లో ఇరువైపుల నుంచి తప్పొప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే, చైనా దూకుడు చర్యల వల్ల సరిహద్దులో ఉద్రిక్తతలు ఉన్నంతవరకు సంబంధాలను పునరుద్దరించలేమని ఇటీవల వాంగ్ యీతో జరిగిన సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ‘ఇరు దేశాలూ ఒకరికొకరు సహకరించుకుంటూ అంతరాలను తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది.. అనుమానాలు, అపోహలకు బదులు పరస్పరం సహకరించుకోవాలి’ అని వాంగ్ అన్నారు. ‘సరిహద్దు వివాదాలను చర్చల ద్వారా పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం.. ఇదే సమయంలో తమ సార్వభౌమాధికార హక్కులను రక్షించుకోడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తూర్పు లడఖ్‌‌లోని నెలకున్న పరిస్థితులను ప్రత్యక్షంగా ప్రస్తావించారు. భారత్ చైనాలు తమ ఉమ్మడి ప్రయోజనాలను పరిరక్షించుకుని, ప్రపంచ బహుళ అభివృద్ధికి దోహదం చేస్తాయని ప్రపంచం భావిస్తోందని అన్నారు. ‘చాలా ముఖ్యమైన సమస్యలపై ఇరు దేశాలు విధానాలు ఒకేలా లేదా దగ్గరగా ఉన్నాయి.. అందువల్ల చైనా, భారత్ మిత్రులు, భాగస్వాములు, ప్రత్యర్థులు కాదు’ అని ఆయన అన్నారు.


By March 08, 2021 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/amid-lac-thaw-china-foreign-minister-interesting-comments-on-india/articleshow/81386866.cms

No comments