Breaking News

ఢిల్లీ: ఫ్లైట్ టేకాఫ్‌‌కి ముందు షాక్.. కరోనా ఉందని చెప్పిన ప్రయాణికుడు!


విమానం బయలుదేరడానికి సిద్ధమైన వేళ ఓ ప్రయాణికుడు చేసిన ప్రకటనతో ఒక్కసారి తోటి ప్రయాణికులు, సిబ్బంది ఉలిక్కిపడ్డారు. తనకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని చావు కబురు చల్లగా చెప్పాడు. దీంతో ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన ఢిల్లీ-పుణే ఇండిగో విమానంలో గురువారం చోటుచేసుకుంది. మరికొద్ది నిమిషాల్లో విమానం గాల్లోకి ఎగరనుందనగా ఆ వ్యక్తి తనకు కోవిడ్ ఉన్నట్టు సిబ్బందికి చెప్పడం గమనార్హం. దీంతో అందరూ ఉలిక్కి పడగా.. మిగతా ప్రయాణికులను కిందకు దింపేశాడు. ఇండిగోకు చెందిన 6ఈ-286 నెంబర్‌ విమానం మార్చి 4న నుంచి పుణేకు బయలుదేరేందుకు సిద్ధమైంది. ఈ విమానంలో ఎక్కిన ఓ ప్రయాణికుడు తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని క్యాబిన్ క్రూ సిబ్బందికి చెప్పాడు. కోవిడ్ నిర్ధారణ అయినట్టు సర్టిఫికెట్ కూడా చూపించడంతో విమానంలోని వారందరూ షాక్ తిన్నారు. దీంతో అప్రమత్తమైన పైలట్ గ్రౌండ్ కంట్రోలర్స్‌తో మాట్లాడి అక్కడి పరిస్థితిని వివరించాడు. అనంతరం ఆ వ్యక్తికి సమీపంలో కూర్చున్న 6 నుంచి 8 నెంబర్‌ సీట్ల ప్రయాణీకులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని విమానాశ్రయ అధికారులు సూచించారు. రన్‌వే నుంచి విమానాన్ని వెనక్కు మళ్లించి ట్యాక్సీ బే వద్ద నిలిపిన పైలట్ అందులోని ప్రయాణికులను కిందకు దింపేశారు. అనంతరం కోవిడ్ రోగి కూర్చున్న వరుసలోని సీట్లను శానిటైజ్‌ చేసి, కొత్త కవర్‌లను అమర్చారు. దీంతో విమానం రెండు గంటల ఆలస్యంగా బయలుదేరింది. తప్పనిసరిగా కరోనా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. తర్వాత అతడిని విమానాశ్రయ వైద్య సిబ్బందికి అప్పగించామని పేరకొన్నారు. వైద్య పరీక్షల కోసం సౌత్‌ ఢిల్లీలోని ఓ ఆసుపత్రికి తరలించగా అక్కడ నిర్వహించిన కోవిడ్ పరీక్షలో వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ‘మార్చి 4న ఢిల్లీ నుంచి పుణేకు వెళ్లాల్సిన విమానంలో ఎక్కిన ప్రయాణికుడు తనకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు క్యాబిన్ క్రూకి తెలియజేశాడు’ అని ఇండిగో సంస్థ శుక్రవారం ప్రకటించింది. కేంద్రం, విమానయాన శాఖ కోవిడ్-19 నిబంధనలను అనుసరించి ప్రయాణికులను దింపేసి, శానిటైజేషన్ చేశామని తెలిపింది.


By March 06, 2021 at 07:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/passenger-says-he-was-covid-positive-moments-before-take-off-on-delhi-pune-indigo-flight/articleshow/81359542.cms

No comments