Breaking News

వెజ్‌కు బదులు నాన్-వెజ్ పిజ్జా డెలివరీ.. రూ.కోటి పరిహారం కోరిన మహిళ!


వెజిటేరియన్ పిజ్జాను ఆర్డర్ చేస్తే నాన్-వెజ్ పిజ్జా డెలివరీ చేయడంతో అమెరికన్ రెస్టారెంట్ ఔట్‌లెట్‌పై ఓ మహిళ వినియోగదారుల కోర్టులో కేసు వేసింది. తనకు రూ.కోటి నష్టపరిహారం చెల్లించాలని కోరింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి 2019 మార్చి 21న అమెరికన్ రెస్టారెంట్ ఔట్‌లెట్‌ నుంచి పుట్టగొడుగుల పిజ్జాను ఆర్డర్‌ చేశారు. అయితే, చెప్పిన సమయం కంటే ఆలస్యంగా డెలివరీ చేయడమే కాకుండా వెజ్‌కు బదులు నాన్-వెజ్ పిజ్జాను ఇచ్చారు. రుచి చూసిన తర్వాత గానీ అది నాన్-వెజ్ పిజ్జా అని ఆమెకు తెలియలేదు. ఆ రోజు హోళీ కావడంతో తాను, నా పిల్లలు పండుగ సంబరాలు చేసుకుని అలసిపోయి, బాగా ఆకలి వేయడంతో పిజ్జాను ఆర్డర్ చేశామని తెలిపారు. పిజ్జాపై ఉన్న మాంసం ముక్కలను పుట్టగొడుగులుగా భావించి తిన్నామని అన్నారు. తాము పూర్తిగా శాకాహారులమని, మతపరంగా తమ మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుందని సదరు మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. వెజ్‌కు బదులు నాన్-వెజ్‌ను ఎందుకు పంపారని ప్రశ్నిస్తే రెస్టారెంట్ మేనేజర్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని దీపాళీ ఆరోపించింది. అంతేకాదు, తమకు ఉచితంగా పిజ్జాలను ఇస్తామని సామాజిక, ఆర్ధిక హోదాలను కించపరిచారని ఆరోపించారు. ‘చెప్పిన సమయం కంటే అరగంట ఆలస్యంగా పిజ్జాను డెలివరీ చేశారు. నాన్-వెజ్ పిజ్జా పంపడంతో రుచి చూశాక బిత్తరపోయాం. దానిని తినడం వల్ల మతపరంగా మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ అపరాధ భావన జీవితాంతం మమ్మల్ని వెంటాడుతుంది. పరిహారం కోసం పూజలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇలా ఎందుకు చేశారని అడిగితే... సదరు ఔట్‌లెట్‌ మేనేజర్‌ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కుటుంబమంతటికీ ఉచితంగా పిజ్జాలను ఇస్తామంటూ మా సామాజిక, ఆర్థిక హోదాను కూడా కించపరిచారు’అని దీపాళీ తరఫున లాయర్ ఫర్హత్ వార్సీ దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపారు. తమకు పరిహారం కింద కోటి రూపాయాలు అందజేసేలా ఆదేశాలు జారీచేయాలని దీపాళీ తరఫు లాయర్ కోరారు. ఈ ఫిర్యాదుకు సమాధానం కోరుతూ ఢిల్లీ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ సదరు ఔట్‌లెట్‌కు నోటీసులు జారీ చేసింది. పిజ్జా ఔట్‌లెట్ మేనేజర్ స్పందిస్తూ.. పరిహారం విషయంలో చర్చలు జరపడానికి తనకు అధికారం లేనందున, ఈ విషయాన్ని లీగల్ బృందానికి అప్పగిస్తానని తెలిపాడు.


By March 14, 2021 at 01:30PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/up-woman-moves-court-over-delivery-of-non-veg-pizza-seeks-one-crore-compensation/articleshow/81493423.cms

No comments