Breaking News

ఐరాసకు ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థ నుంచి భారీ విరాళం!


భారత్ నిషేధించిన ఖలిస్థాన్ అనుకూలవాద సంస్థ (ఎస్ఎఫ్‌జే) నుంచి ఐక్యరాజ్యసమితికి 10వేల డాలర్లు (రూ.7లక్షలు) విరాళం అందింది. ఇదే సమయంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతుల పట్ల వ్యవహరిస్తోన్న తీరుపై దర్యాప్తునకు ‘విచారణ కమిషన్’ఏర్పాటుచేయాలని ఐరాసలో ఎస్‌జేఎఫ్ లాబీయింగ్ చేస్తోంది. ఎస్ఎఫ్‌జే నుంచి విరాళంగా 10వేల డాలర్లు అందినట్టు ఐరాస హ్యూమన్ రైట్స్ కమిషనర్ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇది తమకు ఆన్‌లైన్ ద్వారా అందినట్టు తెలిపారు. అధికార ప్రతినిధి జెనీవాలో మాట్లాడుతూ.. ‘సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్‌జే) గ్రూప్ నుంచి మార్చి 1న ఆన్‌లైన్ ద్వారా 10 వేల డాలర్లు విరాళంగా అందింది.. ఐరాస ఆంక్షల జాబితాలో ఉన్న సమూహాలు లేదా వ్యక్తులు, సంస్థ యూఎన్ చార్టర్ లేదా దాని సూత్రాలకు విరుద్ధంగా కార్యకలాపాలలో నిమగ్నమైతే తప్ప సాధారణంగా ఆన్‌లైన్ ద్వారా అందిన విరాళాలను తిరస్కరించలేం’ అన్నారు. ఖలిస్థాన్ వేర్పాటువాద అనుకూల సంస్థ ఎస్‌జేఎఫ్ జనరల్ కౌన్సిల్, అమెరికాలో ఉన్న గురుపత్వాంత్ సింగ్ పన్నున్‌ మాట్లాడుతూ..‘శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై హింస, దేశద్రోహ ఆరోపణలు చేస్తున్న విషయంలో కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఏర్పాటుకు సిక్కు సంఘం నుంచి ఇంకా 1.3 మిలియన్ డాలర్లు అందజేయడానికి సిద్ధంగా ఉంది’ అని వివరించారు. ‘నాకు తెలిసినంత వరకూ ఐరాస ఎటువంటి కమిషన్‌ను ఏర్పాటుచేయలేదు.. కానీ ఈ విషయమై మేము మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం ద్వారా సంప్రదిస్తూ ఉంటాం’ అని పన్నున్ అన్నారు. అంతర్జాతీయ మానవహక్కుల చట్టాల ఉల్లంఘనపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ (సీఓఐ)ని ఏర్పాటుచేస్తారు. ప్రస్తుతం సిరియాలో ఒకటి ఉంది. అయితే, భారత్‌లో పరిస్థితులపై సీఓఐ ఏర్పాటుకు మానవహక్కుల కమిషన్ ఎటువంటి ప్రయత్నాలు చేయడంలేదని ఐరాస అధికార ప్రతినిధి తెలిపారు.


By March 14, 2021 at 12:12PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/un-confirms-10000-donation-from-pro-khalistan-outfit-sikh-for-justice/articleshow/81492805.cms

No comments