Breaking News

ఫ్యాన్‌కు వేలాడుతూ బీజేపీ ఎంపీ.. ఏం జరిగింది?


బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రామ్‌ స్వరూప్‌ శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో బుధవారం (మార్చి 17) ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. స్వరూప్ శర్మ వ్యక్తిగత సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్వరూప్ శర్మ వయసు 62 ఏళ్లు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి జిల్లాలో ఆయన జన్మించారు. మండి లోక్‌సభ స్థానం నుంచి 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. శర్మకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్‌ హాస్పిటల్ సమీపంలోని గోమతి ఆపార్ట్‌మెంట్‌లో శర్మ నివాసం ఉంటున్నారు. బుధవారం ఉదయం ఎంపీ శర్మకు ఫోన్‌ చేయగా ఆయన ఎంతకీ ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదని వ్యక్తిగత సహాయకుడు తెలిపాడు. దీంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫోన్‌ చేసినట్లు చెప్పాడు. పోలీసులు శర్మ ఫ్లాట్‌కు వెళ్లి చూడగా.. ఆయన గది తలుపులు లోపల నుంచి గడియ పెట్టి ఉంది. లోపల నుంచి సమాధానం లేకపోవడంతో గది తలుపు బద్దలుకొట్టగా.. ఎంపీ శర్మ సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. ఆయన అప్పటికే మరణించినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఎంపీ స్వరూప్ శర్మ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ఆయన కరోనాకు వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. ఎంపీ మరణంతో బుధవారం జరగాల్సిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని రద్దు చేశారు. ఫిబ్రవరిలో దాద్రానగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ముంబైలోని ఓ హోటల్‌ గదిలో ఆయన ఉరేసుకుని మరణించారు. గదిలో గుజరాతీలో రాసిన సూసైడ్ లేఖ లభించినట్లు పోలీసులు తెలిపారు. ఆ లేఖలో కొంత మంది నాయకులపై ఆయన సంచలన ఆరోపణలు చేసినట్లు సమాచారం.


By March 17, 2021 at 10:24PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-mp-ram-swaroop-sharma-was-found-hanging-at-his-flat-in-delhi/articleshow/81555011.cms

No comments