Breaking News

పార్టీలో చేరిన వెంటనే యశ్వంత్ సిన్హాకు మమత కీలక బాధ్యతలు


ఇటీవల పార్టీలో చేరిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు మమతా బెనర్జీ కీలక పదవిని కట్టబెట్టారు. యశ్వంత్ సిన్హాను టీఎంసీ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సుబ్రతబక్షి తెలిపారు. అలాగే, టీఎంసీ జాతీయ వర్కింగ్ కమిటీ‌లోనూ సభ్యుడిగా అవకాశం కల్పించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి చేరిక టీఎంసీకి లబ్ది చేకూరుతుందని భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో యశ్వంత్ సిన్హా సేవలను పార్టీకి వినియోగించుకునేందుకు వీలుగా ఉపాధ్యక్ష బాధ్యతలను ఆయనకు అప్పగించారు. నందిగ్రామ్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై దాడి మరోసారి తనను రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించాలని బలవంతం చేసిందని టీఎంసీలో చేరిన తరువాత సిన్హా వ్యాఖ్యానించారు. బెంగాల్‌లో గెలుపు కోసం బీజేపీ ఎంతటికైనా తెగిస్తుందని, మమతాపై దాడి తర్వాత ఆమెతో కలిసి పనిచేయాలని నిర్ణయించకున్నానని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఇటువంటి తరుణంలో భారీ మెజార్టీతో టీఎంసీని గెలవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి క్యాబినెట్‌లో ఆర్ధిక, విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేసిన యశ్వంత్ సిన్హా.. 2018లో బీజేపీ నుంచి బయటకొచ్చారు. బీజేపీలో ఉన్నప్పుడే ప్రధాని నరేంద్ర మోదీ విధానాలపై బాహటంగా విమర్శలు గుప్పించిన యశ్వంత్.. ఆ పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత మరింత దూకుడు పెంచారు. యశ్వంత్ సిన్హా చేరిక గత కొద్ది రోజులుగా బీజేపీలోకి భారీగా తృణమూల్ నేతల వలస కొనసాగుతున్న వేళ.. సిన్హా చేరిక మమతకు కొంత ఊరటనే చెప్పాలి. ప్రభుత్వం చేసిన తప్పులను ఆపడానికి ఎవరూ లేరు. వాజ్‌పేయి కాలంలో బీజేపీ ఏకాభిప్రాయాన్ని నమ్మింది.. కాని నేటి ప్రభుత్వం అణిచివేత, బలప్రయోగంతో జయించాలని నమ్ముతుంది. అకాలీదళ్, బీజేడీలు బీజేపీకి దూరమయ్యాయి... ఈ రోజు ఆ పార్టీతో ఎవరు ఉన్నారు?’ అని యశ్వంత్ ప్రశ్నించారు.


By March 15, 2021 at 12:55PM


Read More https://telugu.samayam.com/elections/assembly-elections/west-bengal/news/senior-leader-yashwant-sinha-appointed-as-trinamool-congress-vice-presiden/articleshow/81507577.cms

No comments