గరిటె లేకుండాా చేతితోనే కాగుతున్న నెయ్యిలో నుంచి పూర్ణాలు వండిన బామ్మ
మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా ఓ బామ్మ సలసల కాగుతున్న నేతిలో పండి వంటలను గరిటె ఉపయోగించకుండా తన చేతితోనే తీసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమిళనాడులోని విరుద్నగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు అమ్మవారి ఆలయంలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీవిల్లిపుత్తూరు భద్రకాళియమ్మన్ ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి వేళ పిండి వంటలను చేయడమనే సంప్రదాయం వందేళ్లుగా కొనసాగుతోంది. సలసల కాగుతున్న నూనెలో వేగిన వంటలను కేవలం చేతివేళ్లతోనే ఎటువంటి సామాగ్రి ఉపయోగించకుండా తీస్తారు. ఈ ఏడాది కూడా శివరాత్రి నాడు గురువారం అర్ధరాత్రి ముత్తమ్మాళ్ (86) అనే వృద్దురాలు ఆలయ మండపం వద్ద పిండివంటలు చేశారు. సలసల కాగే నూనెలో పూర్ణాలు వేసి, అవి వేగిన తర్వాత గరిటెకు బదులు తన చేతిని ఉపయోగించి బయటకు తీశారు. చాలాసార్లు ఆ బామ్మ కాగుతున్న నూనెలో చేయి పెట్టినా ఎలాంటి గాయం కాకపోవడం విశేషం. పరమేశ్వరుడి అనుగ్రహం వల్లే తాను కొన్నేళ్లుగా చేతితో పిండివంటలు చేస్తున్నానని ఆ బామ్మ తెలిపారు. ఈ బామ్మ గత 57 ఏళ్లుగా ఆలయంలో చేతితోనే పిండివంటలు చేయడం గమనార్హం. బామ్మ పూర్ణాలను చేతితో తీస్తుంటే ఈ వింతను చూడటానికి భక్తులు పెద్ద సంఖ్యలో గుమికూడారు. అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి ఉదయం 5 గంటల వరకు వండిన పిండి వంటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, మర్నాడు ఉదయం భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. కాగా, కర్ణాటకలోని ఓ ఆలయంలోనూ ఈ విధంగానే మహాశివరాత్రి నాడు పిండి వంటలను నూనెలో నుంచి గరిటె లేకుండా చేత్తోనే తీస్తారు. ఉత్తర కన్నడ జిల్లా కుమటా పట్టణంలోని కామాక్షీదేవి ఆలయంలో ఈ సంప్రదాయం కొనసాగుతోంది.
By March 13, 2021 at 07:58AM
No comments