Breaking News

కోవిడ్ దీర్ఘకాలం కొనసాగితే సీజనల్ వ్యాధిగా మారే ప్రమాదం.. ఐరాస నివేదిక


మహమ్మారి సుదీర్ఘకాలం కొనసాగితే సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి గురువారం హెచ్చరించింది. వాతావరణ కారకాల ఆధారంగా మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలను సడలించకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఏడాది కిందట తొలిసారి చైనాలో వెలుగుచూసిన మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఇప్పటి వరకూ 2.7 మిలియన్ల మందిని పొట్టనబెట్టుకుంది. కోవిడ్ -19 వ్యాప్తిలో వాతావరణ కాలుష్యం, గాలి నాణ్యత ప్రభావాలను తొలిసారి నిపుణుల బృందం పరిశీలించి నివేదికను వెల్లడించింది. కరోనా వైరస్ కాలానుగుణ ప్రమాదంగా అభివృద్ధి చెందుతుందని కొన్ని సంకేతాలు గుర్తించినట్టు నివేదిక తెలిపింది. ఐరాస ప్రపంచ వాతావరణ విభాగానికి చెందిన 16 మంది సభ్యుల నిపుణుల బృందం కోవిడ్‌-19పై అధ్యయనం చేసింది. ఈ సందర్భంగా మహమ్మారి సీజనల్ వ్యాధిగా మారే అవకాశాలను కొట్టిపారేయలేమని వివరించింది. ముఖ్యంగా సమశీతోష్ణ వాతావరణం, శీతాకాలంలో ఇన్‌ఫ్లూయెంజా పీక్ దశకు వెళ్లే మాదిరిగా కరోనా వైరస్ కూడా సీజనల్ వ్యాధిగా రూపాంతరం చెందే సూచనలున్నాయని పేర్కొంది. ఇది చాలా సంవత్సరాలుగా కొనసాగితే, కోవిడ్ -19 బలమైన కాలానుగుణ వ్యాధిగా రుజువు అవుతుందనే అంచనాలకు ఇది ఊతమిచ్చింది. కోవిడ్ -19 వాప్తిని నిరోధించేందుకు వాతావరణం కంటే ప్రధానంగా మాస్క్, ప్రయాణాలపై ఆంక్షలు వంటి చర్యలు ప్రభావం చూపాయి. అందువల్ల వాతావరణ పరిస్థితులు మాత్రమే కోవిడ్ నిరోధక ఆంక్షలను సడలించడానికి ప్రేరేపించవని నిపుణుల బృందం తెలిపింది. ‘ఈ దశలో, కోవిడ్ వ్యాప్తిని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వాలు ఆంక్షలు సడలించడానికి, వాతావరణం, వాయు నాణ్యత కారకాలు మద్దతు ఇవ్వవు’ నిపుణుల బృందం కో-ఛైర్మన్, జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఎర్త ప్లానెటరీ సైన్సెస్ విభాగానికి చెందిన బెన్ జైట్చిక్ అన్నారు. మహమ్మారి తొలి ఏడాదిలో కొన్ని అధిక వేడి ప్రాంతాల్లోనూ వ్యాపించిందని అన్నారు. రాబోయే రోజుల్లో ఇలాగే జరుగుతుందనడానికి ఆధారాల్లేవని వివరించారు.


By March 18, 2021 at 08:51AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/coronavirus-will-prove-to-be-seasonal-if-it-persists-for-many-years-say-un-experts/articleshow/81561911.cms

No comments