Breaking News

రెండో భార్య ఇంటిలో గడుపుతుండగా విషాదం.. ఐదుగురు సజీవదహనం


బిహార్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ పేలి, ఇంటికి నిప్పంటుకున్న ఘటనలో ఐదుగురు సజీవదహనమయ్యారు. కిషన్‌గంజ్ జిల్లా కేంద్రంలో సోమవారం ఉదయం ఈ ఘటన సంభవించింది. సలాం కాలనీలో ఓ ఇంటిలో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు చిన్నారులు సహా ఐదుగురు మంటల్లో కాలిబూడిదయ్యారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులు ఒకే కుటుంబానికి చెందినవారు కావడం బాధాకరం. తీవ్రగాయపడిన మహిళను చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఉదయం పూట ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తగ్గింది. పేలుడు ధాటికి చుట్టుపక్కల ఇళ్లలోని వ్యక్తులు భయంతో పరుగులు తీశారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను అదుపుచేశారు. మంటల్లో కాలిపోతున్న చిన్నారుల ఆర్తనాదాలు విని ప్రతిఒక్కళ్లూ చలించిపోయారు. హృదయవిదారకమైన ఈ సంఘటన కలిచివేసింది. మంటల్లో చిక్కుకున్న ఐదుగురు కాలిబూడిద కావడంతో ఆనవాళ్లు గుర్తుపట్టలేనివిగా ఉన్నాయి. మృతులను నూర్ ఆలమ్, అతడి పదేళ్ల కుమార్తె తొహఫ్ పర్వీన్, ఎనిమిదేళ్ల కుమార్తె షబ్నమ్ పర్వీన్, ఆరేళ్ల కుమారుడు రహ్మత్ రజా, మూడేళ్ల కుమారుడుగా గుర్తించారు. నూర్ ఆలమ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడని అతడి సోదరుడు తెలిపాడు. తన సోదరుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడని, ముగ్గురు భార్యలు వేర్వేరుగా ఉంటున్నారని పేర్కొన్నాడు. ఆదివారం సాయంత్రం రెండో భార్య షెహాజాదీ బానో ఇంటికి నూర్ వచ్చాడని అన్నాడు. రాత్రికి భార్యాపిల్లలతో కలిసి భోజనం చేసి, ఇక్కడే నిద్రపోయాడని వివరించారు. అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమయ్యాడు.


By March 15, 2021 at 11:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/five-people-including-four-children-of-same-family-burnt-alive-in-bihar-kishanganj/articleshow/81506019.cms

No comments