Breaking News

వేధింపులతోనే ఎంపీ ఆత్మహత్య? సాయం కోసం మోదీ, షాలకు లేఖలు రాశారా?


కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్‌ హవేలీ ఎంపీ మోహన్‌ దేల్కర్‌ గత నెల ముంబయిలోని ఓ హోటల్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అయితే, బీజేపీ నేతలు, అధికారుల వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నారని తాజాగా ఆరోపించింది. అంతేకాదు, బలవన్మరణానికి ముందు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు ఆయన లేఖలు రాశారని పేర్కొంది. ఈ మేరకు మహారాష్ట్ర కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ సచిన్‌ సావంత్‌ మీడియా సమావేశంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ నేతలు, అధికారులు వేధింపుల నుంచి రక్షించాలని ప్రధాని, హోంమంత్రిని వేడుకున్నా పట్టించుకోలేదని, సాయం లభించికపోవడంతోనే దేల్కర్ ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటన ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అని సావంత్ మండిపడ్డారు. ‘ఆత్మహత్యకు ముందు తనకు సాయం చేయాలని కోరుతూ మోదీ, అమిత్ షాలకు దేల్కర్‌ పలుమార్లు లేఖలు రాశారు. ఇది ఓ ఎంపీ చావు బతుకులకు సంబంధించిన విషయం.. ప్రధాని, హోంమంత్రి ఆ లేఖలకు స్పందిస్తే ఆయన ప్రాణాలతో ఉండేవారు.. వారు ఉద్దేశపూర్వకంగానే ఆయన లేఖలను విస్మరించారా?’ అని ప్రశ్నించారు. దాద్రా నగర్ హవేలీ అడ్మినిస్ట్రేటర్‌ ప్రఫూల్ ఖేడా పటేల్ సహా పలువురు కేంద్ర పరిపాలనాధికారులు దేల్కర్‌ను అవమానించి, మానసిక హింసకు గురిచేశారని సావంత్ ఆరోపణలు చేశారు. ఎంపీకి సంబంధం లేని నేరాల్లో ఇరికించేందుకు ప్రయత్నించి, ఆయన కుటుంబాన్ని జైలుకు పంపుతామని తీవ్ర భయాందోళనకు గురిచేశారని దుయ్యబట్టారు. వారి వేధింపులను తట్టుకోలేక తనకు సాయమందించాలని దేల్కర్‌ పలుమార్లు లేఖలు రాశారని అన్నారు. ప్రధానికి గతేడాది డిసెంబర్‌ 18న ఒకటి, ఈ ఏడాది జనవరి 31న మరో లేఖను రాశారని పేర్కొన్నారు. ప్రధానిని అత్యవసర అపాయింట్‌మెంట్‌ కూడా అడిగారని, డిసెంబర్‌ 18న, జనవరి 12న అమిత్‌షాకు లేఖలు రాశారని వివరించారు. ఓం బిర్లాకు మూడు లెటర్లు, స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌ భూపేంద్ర యాదవ్‌కు ఓ లేఖ రాశారని సచిన్‌ సావంత్‌ పేర్కొన్నారు. ప్రధాని సకాలంలో స్పందించి తగిన చర్యలు తీసుకుంటే ఎంపీ బతికుండేవారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నాయకత్వంపై పూర్తిగా నమ్మకం కోల్పోయి, వారి నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందవని నిర్ణయించుకునే దేల్కర్‌ తనువు చాలించాడని వాపోయారు. దాద్రా అండ్ నగర్ హవేలీ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన మోహన్‌ దేల్కర్‌ ఫిబ్రవరి 22న ముంబయిలోని ఓ హోటల్‌ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలంలో 15 పేజీల సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో ప్రఫూల్‌ కే పటేల్‌, గుజరాత్‌ గవర్నర్‌ సహా పలువురి పేర్లు ఉన్నట్లు సమాచారం.


By March 15, 2021 at 06:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/before-suicide-mohan-delkar-sought-help-from-modi-amit-shah-multiple-times-congress/articleshow/81502795.cms

No comments