Breaking News

స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు దాటింది.. ఇంకెన్ని తరాలు రిజర్వేషన్లు: సుప్రీంకోర్టు


విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల అంశంపై విస్తృత ధర్మాసనం రోజువారీ విచారణ కొనసాగుతోంది. ఈ రిజర్వేషన్లు ఇంకా ఎన్ని తరాలపాటు కొనసాగుతాయని శుక్రవారం నాటి విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. విద్య, ఉద్యోగాల్లో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేయడంతో ఈ అంశం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేస్తే తలెత్తే ‘అసమానతల’పై ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆందోళన వ్యక్తంచేసింది. మారిన పరిస్థితుల నేపథ్యంలో రిజర్వేషన్లపై పరిమితి విధించిన ‘మండల్‌ తీర్పు’ను పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ పేర్కొన్నారు. కోటాలను నిర్దేశించే అంశాన్ని రాష్ట్రాలకే న్యాయస్థానాలు వదిలేయాలని వాదించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కూడా 50 శాతం కోటాను ఉల్లంఘించిందని రోహత్గీ అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మీరు చెబుతున్నట్లు 50 శాతం కోటా పరిమితిని తొలగిస్తే దాని కారణంగా తలెత్తే అసమానతల పరిస్థితేంటి? అంతిమంగా దాన్ని మేం తేల్చాల్సి ఉంటుంది. ఈ అంశంపై మీ వైఖరేంటి? ఎన్ని తరాలపాటు దీన్ని కొనసాగిస్తారు’ అని ధర్మాసనం నిలదీసింది. మండల్‌ తీర్పును పునఃసమీక్షించడానికి అనేక కారణాలు ఉన్నాయని రోహత్గీ వాదించారు. 1931తో పోల్చితే జనాభా అనేక రెట్లు పెరిగి 135 కోట్లకు చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచింది.. రాష్ట్రాలు చాలా సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపట్టాయి.. ఏ అభివృద్ధి జరగలేదని, వెనుకబడిన వర్గాలు ముందుకు సాగలేదని మనం అంగీకరించగలమా’ అని వ్యాఖ్యానించింది. అంతేకాదు, మండల్ తీర్పును పునఃసమీక్షించే ఉద్దేశం వెనుకబాటుతనం నుంచి బయటకు వచ్చిన వారిని నిర్మూలించడమేనని కూడా గమనించాలని పేర్కొంది. జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ఈ ధర్మాసనంలో జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌ సభ్యులుగా ఉన్నారు. ‘అవును ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.. కానీ, వెనుకబడి తరగతులు 50 శాతం నుంచి 20 శాతానికి తగ్గిపోలేదు.. ఈ దేశంలో ఇప్పటికీ ఆకలి చావులు కొనసాగుతున్నాయి.. ఇందిరా సాహ్నీ తీర్పు పూర్తిగా తప్పని, దానిని చెత్తబుట్టలో వేయాలని చెప్పడం లేదు.. ఈ తీర్పు వచ్చి 30 ఏళ్లు దాటింది.. చట్టాలు పూర్తిగా మారాయి, జనాభా పెరగడంతో సమాజంలో వెనుబడిన వర్గాలు కూడా పెరుగుతున్నాయి’ అని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. రాజ్యాంగంలో చేసిన సవరణలను గుర్తుచేసిన ఆయన.. వెనుకబడిన తరగతులు అనుకున్నంత మేర ముందుకు వెళ్లలేదని అన్నారు.


By March 20, 2021 at 07:08AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/supreme-court-asks-how-many-generations-will-reservation-continue/articleshow/81598087.cms

No comments